సిడ్నీ: అవును. ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాలో చేతిలో టీమిండియా ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్ర్కమించింది. అయితే టీమిండియా వరుస విజయాలతో ఇక్కడి వరకు వచ్చిన సంగతి మర్చిపోతారా? ఏదో జరిగిపోయినట్లు అభిమానులు, మీడియా.. టీమిండియా, ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు చేయడం సబబేనా? ఆటలో గెలుపు ఓటములు సహజం. అలాంటప్పుడు క్రీడాస్ఫూర్తితో వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది.
95 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలుకావడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆటగాళ్ల పోస్లర్లను తగలబెట్టడం, కొట్టడం సరైన పద్ధతి అనిపించుకుంటుందా? మీడియా కూడా క్రీడా స్ఫూర్తితో వ్యవహరించకుండా ఆటగాళ్లపై విమర్శలు చేయడం సరికాదు.

ప్రపంచ కప్ టోర్నీలో 7 వరుస విజయాలను సాధించినప్పుడు ఎంతో ఆనందించారు. గురువారంతో ఆ విజయాలకు బ్రేక్ పడింది. టీమిండియా కంటే బాగా ఆడారు కాబట్టి ప్రత్యర్థి జట్టు గెలుపొందింది. టీమిండియా కూడా శక్తి సామర్థ్యాల మేరకు బాగానే ఆడింది.
అయితే ఓటమిని ఎందుకు అవమానంగా భావించాలి? ఆటగాళ్లను ఎందుకు నిందించాలి? ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ ప్రపంచ కప్ టోర్నీలో సెమీస్ వరకూ వెళ్లి గర్వపడేలా చేశారు వాళ్లు.
ట్విట్టర్లో చూస్తున్నాం. కొందరు అభిమానులు టీమిండియా ఓడిపోవడంతో తీవ్ర ఆగ్రహంతో టీవీలను బద్దలుకొడుతున్నారు. మరికొందరు సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అనుష్కను కలుసుకునేందుకే విరాట్ 1 పరుగు చేసి ఔటయ్యాడని అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. అంతేగాక, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ప్రదర్శన చూసేందుకే సిడ్నీకి వెళ్లిందా? అనుష్క శర్మ అని అసభ్య సందేశాలు పోస్టు చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా, క్రికెట్ నిపుణులు, యాంకర్లు టీవీ ఛానళ్లలో టీమిండియా ప్రదర్శనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ అయితే ఒక అడుగు ముందుకేసి 'షేమ్ ఇన్ సిడ్నీ' అని పేర్కొంది. ఇందులో సిగ్గుపడాల్సిన విషయం ఏముంది. భారత ఆటగాళ్లు ఎవరూ అలాంటి పని చేయలేదే?.
గెలువాలనుకోవడంలో తప్పులేదు, కానీ అన్ని మ్యాచుల్లోనూ టీమిండియానే గెలవాలనుకోవడం తప్పే. ఇది మీడియా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఒక మ్యాచులో ఓటమి, గెలుపు ఉంటాయి. గురువారం టీమిండియాదే ఓటమి.
చాలా సార్లు మీడియా, అభిమానులు టీమిండియాపై అంచనాలకు మించి ఆశలు పెట్టుకుంటున్నారు. అది సరికాదు. అంచనాలేవీ లేకుండానే టీమిండియా సెమీ ఫైనల్ వరకూ వెళ్లింది. ఆటగాళ్లు బాగా ఆడకుండా ఉంటే అది సాధ్యమయ్యే పనికాదు. మెన్ ఇన్ బ్లూ ప్రదర్శన పట్ల మనం గర్వించాలే తప్ప వారిపై విమర్శలు చేయడం సరికాదు. ఎందుకంటే ఎంత గొప్ప జట్టుకైనా ఓటమి తప్పకపోవచ్చు.