
హైదరాబాద్: ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్లో భారత స్టార్ షూటర్ మను భాకర్ స్వర్ణ పతకం సాధించింది. చైనాలోని పుటియన్లో మంగళవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్లో మను భాకర్ స్వర్ణాన్ని సాధించింది. మొత్తం 244.7 పాయింట్లతో జూనియర్ వరల్డ్ రికార్డుని మను భాకర్ బద్దలు కొట్టింది.
అంతేకాదు ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్ 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్లో స్వర్ణం నెగ్గిన రెండో భారత మహిళగా మను భాకర్ నిలిచింది. అంతకముందు ఇదే ఈవెంట్లో భారత షూటర్ హీనా సిద్ధు స్వర్ణ పతకం సాధించింది. ఇప్పటికే మను భాకర్ వచ్చే ఏడాది టోక్యో వేదికగా జరిగే ఒలింపిక్స్ అర్హత సాధించింది.
మరోవైపు ఇదే టోర్నీలో మరో భారత షూటర్ యశశ్విని దేశ్వాల్ 158.8 పాయింట్లు స్కోర్ చేసి ఆరో స్థానంలో నిలిచింది. సెర్బియాకు చెందిన జోరానా అరునోవిక్(241.9 పాయింట్లు)తో సిల్వర్ పతకం సొంతం చేసుకోగా, చైనాకు చెందిన క్విన్ వాంగ్(221.8) పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.
ఇక, పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో అభిషేక్ వర్మ, సౌరభ్ చౌదరి ఫైనల్కు అర్హత సాధించారు. అర్హత పోటీల్లో అభిషేక్ వర్మ 588 పాయింట్ల అగ్రస్థానంలో ఉండగా, చౌదరి 581 పాయింట్లతో ఏడవ స్థానంలో ఉన్నాడు. బుధవారం జరిగిన 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మను భాకర్, రాహి సర్నోబాట్ నిరాశపరిచారు.