కాన్బెర్రా: డీఆర్ఎస్ పైన కాంట్రోవర్సీ కొనసాగుతోంది. ప్రపంచకప్లో ఇప్పటికే డీఆర్ఎస్ నిర్ణయం రెండుసార్లు విమర్శలకు తావిచ్చింది. జింబాబ్వే - వెస్టిండీస్ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్లోను డీఆర్ఎస్ వివాదాస్పదమైంది. ఈ ప్రపంచకప్లో అంతకుముందు... ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా, భారత్ - పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచులలో డీఆర్ఎస్ వివాదాస్పదమైంది.
తొలుత వెస్టిండీస్ బ్యాటింగ్ చేసింది. ఆ తర్వాత జింబాబ్వే బ్యాటింగ్ చేసింది. 21వ ఓవర్లో.. వెస్టిండీస్ సారథి జాసన్ హోల్డర్ డీఆర్ఎస్కు అప్పీల్ చేయడం.. జింబాబ్వే బ్యాట్స్మెన్ బ్రెండన్ టేలర్ను అవుట్గా ప్రకటించడం జరిగింది.
మార్లోన్ శామ్యూల్ వేసిన 21వ ఓవర్లో టేలర్ షాట్ కొట్టాడు. బాల్ అతని ముంజేయికి తాకి.. వికెట్ కీపర్ రామ్ దిన్ చేతిలో పడింది. దీంతో వెస్టీండీస్ ప్లేయర్లు అవుట్ కోసం అప్పీల్ చేశారు.

అంపైర్ ఇయాన్ గ్లౌడ్ నాటౌట్గా ప్రకటించాడు. దీంతో వెస్టిండీస్ సారథి హోల్డర్ డీఆర్ఎస్ కోసం పట్టుబట్టాడు. బంతి గ్లౌవ్స్కు తాకినట్లుగా వీడియోలో కనిపించింది. అది బ్యాట్కు తాకలేదు. థర్డ్ అంపైర్ అతనిని అవుట్గా ప్రకటించాడు. ఫీల్డ్ అంపైర్ గ్లౌడ్ కూడా అనంతరం తన నిర్ణయాన్ని అవుట్గా మార్చుకున్నాడు. దీంతో టేలర్ 48 బంతుల్లో 37 పరుగులు చేసి క్రీజు వదలవలసి వచ్చింది.
ఇదిలా ఉండగా, జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో క్రిస్ గేల్ 138 బంతుల్లో 16 సిక్స్లు, 9 ఫోర్లతో డబుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో గేల్ 147 బంతుల్లో 215 పరుగులు చేశాడు. దీంతో అతని పైన ట్విట్టర్లో ప్రశంసలు కురిపిస్తున్నారు.