పెర్త్: ఏ స్థానం నుంచైనా ఆడగలడని యువ ఆటగాడు అజింక్యా రహానేపై భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రశంసల వర్షం కురిపించాడు. రహానే లాంటి ఆటగాడు జట్టులో ఉంటే కెప్టెన్ పని చాలా తేలికవుతుందని ధోని అన్నాడు. జట్టు కోసం ఏ పనిచేయడానికైనా అజింక్య రహానే ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడని చెప్పాడు.
'ఫలానా స్థానంలోనే ఫీల్డింగ్ చేస్తానని గిరిగీసుకోడు. కెప్టెన్ ఏది చెబితే అది చేస్తాడు. కొందరుంటారు కేవలం కవర్స్లో మాత్రం చేస్తామంటారు. రహానె అలా కాదు. బౌండరీలైనులోనైనా చేస్తాడు. లెగ్స్లిప్ దగ్గరైనా సరే అంటాడు. కొత్త ఆలోచనలు అమలు చేయడానికి అతడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. 'చేయను' అన్న పదం రహానె నుంచి రాదు' అని ధోనీ పేర్కొన్నాడు.
అంతేగాక, 'జట్టు కోసం ఎలాంటి ఆలోచననైనా అమలు చేస్తాడు. ఆ ఆలోచన తనకు సత్ఫలితాన్నిచ్చినా, ఇవ్వకపోయినా ప్రయత్నిస్తాడు. కొత్త ఆలోచనలకు స్వాగతం పలుకుతాడు. వందశాతం కష్టపడతాడు. రహానె బ్యాటింగ్లో గొప్పదనం అతడి టైమింగే. ఫీల్డింగ్లో ఖాళీలను చక్కగా ఉపయోగించుకుంటాడు' అని ధోని రహానేపై ప్రశంసలు గుప్పించాడు.

రహానే ఆటతీరు బాగుంది: వసీం అక్రమ్
పాకిస్థాన్ జట్టు మాజీ ఆటగాడు వసీం అక్రమ్ క్షిణాఫ్రికాపై భారత్ ప్రదర్శన ఆకట్టుకుందని తెలిపాడు. టీమిండియా ప్రపంచ ఛాంపియన్ మాదిరే ఆడుతోందని కొనియాడాడు. టాస్ గెలిచినప్పటి నుంచి అన్ని రంగాల్లోనూ దక్షిణాఫ్రికాపై ఆధిపత్యం కనబరిచిందని, ధావన్ మళ్ళీ ఫామ్లోకి రావడం భారత జట్టుకు అదనపు బలమని చెప్పాడు.
రహానె ఆట చూడముచ్చటగా ఉందని పేర్కొన్నాడు. 'భారత బ్యాటింగ్లో నిస్తేజంగా అనిపించిన సందర్భం ఒక్కటీ లేదు. చివరి ఓవర్లలో ధోని ఎంత విలువైన ఆటగాడో అందరికీ తెలుసు. షార్ట్పిచ్ బంతుల్ని పుల్, హుక్ చేయడంలో దిట్ట. చూస్తుండగానే మ్యాచ్ను లాగేసుకుంటాడు' అని అక్రమ్ తెలిపాడు. స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారని ప్రశంసించాడు. షమి, ఉమేశ్, మోహిత్లు ఆకట్టుకుంటున్నారని చెప్పాడు.
దక్షిణాఫ్రికా ఒత్తిడిలో ఉన్నప్పుడు యుద్ధం నుంచి పారిపోతుందని, ఆ జట్టుకు ఉన్న మానసిక సమస్య ఇదేనని పేర్కొన్నాడు. 'సాయంత్రం నుంచి బంతిలో వేగం పెరుగుతుంది. ధైర్యవంతులకే అదృష్టం కలిసొస్తుంది. ధోని ధైర్యవంతుడు, అదృష్టవంతుడు. టీమ్ఇండియా ఫీల్డింగ్ కూడా అద్భుతం. ఫీల్డింగ్ను ఆటగాళ్ళంతా ఆస్వాదించారు' అని వసీం అక్రమ్ తెలిపాడు.