మెల్బోర్న్: ప్రాక్టీస్ సందర్భంగా భారత్ ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్వల్పంగా గాయపడ్డాడు. తొలిరోజు ఆదివారంనాడు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన అశ్విన్కు పుల్షాట్ ఆడే క్రమంలో కుడి మోచేతికి గాయమైంది. దీంతో చేతిని రుద్దుకుంటూ వెంటనే మైదానం నుంచి వెనుదిరిగాడు. కొద్దిసేపు మోచేతికి ఐస్ ప్యాక్ను తగిలించుకుని విశ్రాంతి తీసుకున్నాడు.
అనంతరం మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టి ఉమేశ్, భువీ బౌలింగ్లో పూర్తి స్థాయి షాట్లు ప్రాక్టీస్ చేశాడు. అశ్విన్ స్వేచ్ఛగా ఆడడంతో టీమ్ మేనేజ్మెంట్ ఊపిరి పీల్చుకుంది. ఉమేష్ యాదవ్ వేసిన బంతికి అశ్విన్ గాయపడినట్లు తెలుస్తోంది. అశ్విన్కు తగిలిన గాయం పెద్దదేమీ కాదని టీమిండియా మీడియా మేనేజర్ చెప్పారు.
గ్యారీతో ప్రమాదం లేదు: గవాస్కర్
దక్షిణాఫ్రికా జట్టుకు సలహాలందిస్తున్న టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్స్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మైకేల్ హస్సీతో భారత్కు ప్రమాదమేమీ లేదని భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. భారత ఆటగాళ్ల గురించి, డ్రెస్సింగ్ రూం గురించి పూర్తి అవగాహన ఉన్న కిర్స్టెన్తో టీమిండియాకు ప్రమాదమని పలువురు అభిప్రాయపడుతున్న విషయం తెలిసిందే.

దానిపై సునీల్ గవాస్కర్ తన అభిప్రాయం వెల్లడించాడు. కిర్స్టెన్, హస్సీ గురించి ఎక్కువగా ఆలోచించనవసరం లేదని, వాళ్లు సలహాలు ఇవ్వగలరే తప్ప మైదానంలోకి దిగి ఆడలేరని, స్టెయిన్ బృందాన్ని ఎలా ఎదుర్కొంటారన్నదానిపైనే టీమిండియా విజయం ఆధారపడి ఉందని ఆయన అన్నాడు. వారిని తేలికగా తీసుకుంటే ఎంత బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టుకైనా ప్రమాదమేనని అన్నాడు.
ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ కూడా సన్నీతో ఏకీభవించాడు. వారిద్దరితో భారత్కొచ్చిన ముప్పేమీ లేదని, దక్షిణాఫ్రికా బౌలర్ల నుంచే ధోనీసేనకు అసలైన సవాల్ ఎదురవనుందని చెప్పాడు. స్పిన్ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడే సఫారీలతో మ్యాచ్లో రవీంద్ర జడేజా కంటే అక్షర్ పటేల్నే తుదిజట్టులోకి తీసుకోవాలని చాపెల్ టీమిండియాకు సూచించాడు.