మెల్బోర్న్: ఆస్టేలియాలో రెండు నెలల అనుభవం. ఆస్టేలియాతో జరిగిన టెస్టు, వన్డే సిరిస్ల్లో పూర్తి వైఫల్యం. అదే దేశంలో, ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్లో ధోని సేన వరుస విజయాలు. పాకిస్ధాన్, దక్షిణాఫ్రికాలపై రెండు అధ్బుత విజయాలు.
అవి కూడా చిన్నా చితకా విజయాలు కాదు పాకిస్ధాన్పై 76 పరుగుల తేడాతో గెలిస్తే, దక్షిణాఫ్రికాపై ఏకంగా 130 పరుగల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఒక్కసారిగా వన్డేల్లో పుంజుకున్న టీమిండియా సమిష్టి కృషే దీనికి కారణం అంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఆదివారం దక్షిణాఫ్రికాపై 130 పరుగుల విజయం సాధించడానికి అనేక అంశాలు దోహదపడ్డాయి. వాటిల్లో 10 అతి ముఖ్యమైన అంశాలేంటో చూద్దాం.

1. ఓపెనర్ శిఖర్ ధావన్ కెరీర్ బెస్ట్ 137. వరల్డ్ కప్లో దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసిన రెండవ ఆటగాడు. 2011 వరల్డ్ కప్లో దక్షిణాఫ్రికాపై సచిన్ టెండూల్కర్ సెంచరీ(111 పరుగులు) నమోదు చేశాడు. టోర్నమెంట్లో మొదట ఒత్తిడిని ఎదుర్కొన్న ధావన్ ఈ సెంచరీతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు.
2. 60 బంతుల్లో యమా స్పీడ్గా అర్ధ సెంచరీ(79 పరుగులు-7 ఫోర్లు, 3 సిక్సులు) సాధించిన అజ్యంకె రహానే.
3. వరల్డ్ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ ఉన్నా... దక్షిణాఫ్రికాపై 300కు పైగా పరుగులు సాధించడం టీమిండియాకు కలిసి వచ్చిన అంశం.
4. రెండు సెంచరీల భాగస్వామ్యం: ధావన్-విరాట్ కోహ్లీ (127- రెండవ వికెట్కి), ధావన్-అజ్యెంకే రహానే (125 - మూడవ వికెట్కి)
5. 30 పరుగులకే దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డెవిలియర్స్ను రనౌట్ చేసిన బౌలర్ మెహిత్ శర్మ. మ్యాచ్ అనంతరం కెప్టెన్ ధోని మాట్లాడుతూ ఏబీ డెవిలియర్స్ రనౌట్ను మ్యాచ్ టర్నింగ్ పాయింగ్గా పేర్కొనడం.
6. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో టీమిండియా అత్యుత్తమ ఫీల్డింగ్.
7. 308 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాను ధోని కట్టడి చేయగలిగిన స్ట్రాటజీ. ధోని కెప్టెన్సీని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ప్రశంసలతో ముంచెత్తారు.
8. కీలకపాత్ర పోషించే టాస్ను ధోని గెవలవడం. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లాంటి పెద్ద మైదానాల్లో 300 స్కోరుని ఛేజ్ చేయడం కష్టంతో కూడుకున్న పని.
9. ఇండియా బౌలర్లు అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చారు.
10. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ కెపాసిటీ లక్ష మంది. అందులో సుమారు 90,000 మంది మద్దతు టీమిండియాకు ఉండటం విశేషం. తొలి బంతి నుంచి చివరి బంతి వరకు అభిమానుల మద్దతు టీమిండియా వైపే ఉంది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ ధోని మాట్లాడుతూ మెల్ బోర్న్లో కాదు... ముంబైలో మ్యాచ్ ఆడుతున్నట్లుగా ఉందని చెప్తూ ఫ్యాన్స్కు ధన్యవాదాలు తెలిపాడు.