భారత యువ గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సాధించాడు. గురువారం జరిగిన చివరి రౌండ్లో డిఫెండింగ్ ఛాంపియన్, చైనా స్టార్ డింగ్ లిరెన్ను ఓడించి ఈ ఘనత అందుకున్నాడు. 18 ఏళ్ల 8 నెలల 14 రోజుల వయస్సులో చదరంగంలో విశ్వవిజేతగా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు గారీ కాస్పరోవ్ పేరిట ఉండేది. అతను 22 ఏళ్ల 6 నెలల 27 రోజుల వయస్సులో ఛాంపియన్గా నిలిచాడు.
ఇక వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన రెండో భారతీయుడిగా గుకేశ్ ఘనత సాధించాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత టైటిల్ గెలిచిన భారతీయుడిగా రికార్డులకెక్కాడు. విశ్వనాథన్ అయిదు సార్లు ఛాంపియన్గా నిలిచాడు. నువ్వా-నేనా అన్నట్లు సాగిన 14వ రౌండ్లో నల్ల పావులతో ఆడిన గుకేశ్.. డింగ్ లిరెన్పై పైచేయి సాధించి గెలిచాడు. 13వ రౌండ్ వరకు ఇద్దరూ 6.5 -6.5 పాయింట్లతో సమంగా నిలిచారు.

3, 11, ఆఖరి 14వ రౌండ్లలో గుకేశ్ విజయం సాధించగా.. 1, 12వ రౌండ్లలో డింగ్ లిరన్ నెగ్గాడు. మిగిలిన 2, 4, 5, 6, 7, 8, 9, 10, 13 రౌండ్లు డ్రా ముగిశాయి. అయితే 14వ రౌండ్లో గుకేశ్ అద్భుతంగా పోరాడాడు. ఒత్తిడిని జయిస్తూ విజేతగా నిలిచాడు. కాగా, ఈ ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్కు తెలుగు మూలాలున్నాయి. వాళ్ల పూర్వీకులు ఏపీకి చెందినవారే.పుత్తూరు సమీపంలో పిచ్చాటూరు మండలం చెంచురాజు కండ్రిగ గ్రామంలో గుకేశ్ ముత్తాతలు ఉండేవారు. అయితే తన తల్లిదండ్రులు చెన్నైలో స్థిరపడ్డారు. గుకేశ్ తెలుగు చక్కగా మాట్లాడగలడు.
కాగా, చదరంగంలో రారాజుగా నిలిచిన అనంతరం గుకేశ్ భావోద్వేగానికి గురయ్యాడు. ఆనంద భాష్ఫాలతో పావులను యథాస్థానాల్లో అమర్చి దేవున్ని ప్రార్థించాడు. తర్వాత తన తండ్రి రజినీకాంత్ను హత్తుకుని ఎమోషనల్ అయ్యాడు. ప్రపంచ ఛాంపియన్గా నిలవడంలో గుకేశ్ తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. ఈఎన్టీ సర్జన్ అయిన రజినీకాంత్.. గుకేశ్ కెరీర్ కోసం ఆరేళ్ల క్రితమే ప్రాక్టీస్ ఆపేశారు. విదేశాల్లోని టోర్నీలకు గుకేశ్తో కలిసి వెళ్తున్నారు. కాగా, గుకేశ్ తల్లి పద్మ మైక్రోబయాలజిస్ట్. రజినీకాంత్ ప్రాక్టీస్ను వదిలిన అనంతరం ఆమె సంపాదనతోనే ఇల్లు గడిచింది.