హైదరాబాద్: లండన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అమెరికా అథ్లెట్ టోరీ బోవి మహిళల 100 మీటర్ల పరుగులో కొత్త విజేతగా అవతరించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ రేసులో టోరీ బోవి ఫినిష్లో నెగ్గింది. ఫైనల్లో కేవలం .01 సెకన్ల తేడాతో ఆమె ప్రత్యర్థిని వెనక్కి నెట్టింది.
టోరీ బోవి ఈ రేసును 10.85 సెకన్లలో సొంతం చేసుకుని స్వర్ణం గెలుచుకుంది. ఇదిలా ఉంటే ఇదే రేసులో పోటీపడ్డ ఒలింపిక్ స్వర్ణపతక విజేత ఎలీన్ థామ్సన్ ఐదో స్థానంలో నిలవడం విశేషం. ఫినిష్ లైన్ దగ్గర టోరీ బోవి, మారీ జోసీ టా లౌలలో ఎవరు ముందు ఫినిష్లైన్ను దాటారన్న దానిపై సందిగ్ధత నెలకొంది.
The women's #IAAFworlds 100m champion is @toribowie in 10.85 pic.twitter.com/8xYMIOfPzD
— IAAF (@iaaforg) 6 August 2017
అయితే ఫినిష్లైన్ క్రాస్ చేసే సమయంలో మారీ జోసీ తన కాలును ముందుగా లైన్ దాటించినప్పటికీ, టోరీ బోవి మాత్రం తన తలను ముందుగా లైన్ దాటించింది. దీంతో రిఫరీలు ఫినిష్లైన్ను పరిశీలించి టోరీ బోవిని విజేతగా ప్రకటించారు. ఇక రేసులో మూడో స్థానంలో నిలిచిన డఫ్ని స్కిప్పర్స్ 10.96 సెకన్లతో కాంస్య పతకం గెలుచుకుంది.
ఫైనల్లో చిన్నబోయిన చిరుత: బోల్ట్కు ఊహించని షాక్
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే వంద మీటర్ల రేసులో అమెరికా రెండు పసిడి పతకాలను సాధించింది. శనివారం జరిగిన పురుషుల 100 మీటర్ల పరుగులో అమెరికాకు చెందిన జస్టిన్ గాట్లిన్ జమైకా పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్కు షాకిచ్చి స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే.