
హైదరాబాద్: ఇండోనేషియాలో ఆదివారంతో ముగిసిన ఆసియా గేమ్స్లో అద్భుత ప్రదర్శన చేసిన భారత షూటర్లు దక్షిణ కొరియాలోని చాంగ్వాన్ వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ (ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్) ఛాంపియన్షిప్లోనూ సత్తా చాటుతున్నారు.
ఆసియా గేమ్స్లో భారత షూటర్లు 2 స్వర్ణ పతకాలతో పాటు 4 రజత పతకాలు, 3 కాంస్య పతకాలతో కలిపి మొత్తం తొమ్మిది పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా భారత షూటర్లు అంజుమ్ మౌడ్గిల్, అపూర్వీ చండేలాలు దక్షిణ కొరియాలోని ఐఎస్ఎస్ఎఫ్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రెండు, నాలుగు స్థానాల్లో నిలిచారు.
ఈ విజయంతో ఇద్దరూ 2020 ఒలింపిక్ ఈవెంట్కు అర్హత సాధించడం విశేషం. 2020లో జరిగే ఒలింపిక్స్కు జపాన్ రాజధాని టోక్యో ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. అంజుమ్ ఈ పోటీలో 248.4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం కైవసం చేసుకుంది. కొరియా షూటర్లు హానా ఇమ్ (251.1), జంగ్ (228.0) స్వర్ణ, కాంస్య పతకాలు నెగ్గారు.
అపూర్వీ చండేలా 207 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఈవెంట్లో ఒక దేశానికి రెండు కోటాలు లభిస్తున్న నేపథ్యంలో అపూర్వీకి కూడా అవకాశం దక్కింది. ఒలింపిక్స్కు క్వాలిఫై మొదటి భారత షూటర్స్ జోడిగా వీరిద్దరూ అరుదైన ఘనత సాధించారు. మొత్తం 15 విభాగాల్లో 60 కోటాలు అందిస్తుంది.
మరోవైపు ట్రాప్ ఉమెన్ జూనియర్ ఫైనల్కి చేరిన మనీషా ఖీర్ రజత పతకం సాధించింది. దీంతో పాటు జూనియర్ వరల్డ్ రికార్డును సమం చేసి సంచలనం సృష్టించింది. అలాగే 50 మీటర్ల జూనియర్ ఫిస్టల్ పురుషుల ఈవెంట్లో అర్జున్ సింగ్ చీమకు స్వర్ణం పతకం, గౌరవ్ రాణాకి కాంస్య పతకం వరించింది.
టీమ్ ఈవెంట్లో అర్జున్ చీమా, గౌరవ్ రాణా, అన్మోల్ జైన్ బృందం స్వర్ణం గెలుచుకుంది. అలాగే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో మౌడ్గిల్, చండేలా, గోష్ మెహులీ జట్టు సిల్వర్ మెడల్ సాధించింది.