
మహిళల ఎలైట్ పోటీల్లో ట్రాన్స్జెండర్లు పాల్గొనకుండా వరల్డ్ అథ్లెటిక్స్ నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయంపై జరిగిన ఓటింగ్లో డిఫరెన్సెస్ ఇన్ సెక్స్ డెవలప్మెంట్ (డీఎస్డీ) ఉన్న క్రీడాకారులపై కఠినమైన ఆంక్షలు విధించాలని వరల్డ్ అథ్లెటిక్స్ నిర్ణయించింది. ఇకపై మహిళా విభాగంలో పోటీ పడే క్రీడాకారుల ప్లాస్మా టెస్టోస్టెరాన్.. లీటరుకు 2.5 నానోమోల్స్ ఉండాలని నిర్ణయించారు. ఇంతకుముందు ఇది లీటరుకు 5 నానోమోల్స్గా ఉండేది. దీనిపై జరిగిన ఓటింగ్లో 71 శాతం ఓట్లు నిబంధనను మార్చడానికి అనుకూలంగా పడటం గమనార్హం.
రెండుసార్లు ఒలింపిక్స్ పతకాలు నెగ్గిన క్యాస్టర్ సెమెన్యా, 2020 ఒలింపిక్స్ సిల్వర్ మెడల్ విజేత క్రిస్టీన్ ఎంబోమా, 2016 ఒలింపిక్స్లో రన్నరప్గా నిలిచిన ఫ్రాన్సైన్ నియోన్సాబా వంటి డీఎస్డీ అథ్లెట్స్పై ఈ నిర్ణయం తీవ్రమైన ప్రభావం చూపనుంది. క్రీడల్లో మహిళా విభాగాన్ని కాపాడాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వరల్డ్ అథ్లెటిక్స్ అధ్యక్షుడు సెబాస్టియన్ కో తెలిపారు. అలాగే ఈ విభాగంలో ట్రాన్స్జెండర్లు పాల్గొనడం వల్ల వచ్చే సమస్యలపై ట్రాన్స్జెండర్ అథ్లెట్ నేతృత్వంలో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
పలు క్రీడల్లో ట్రాన్స్జెండర్లను కూడా మహిళల విభాగంలో ఆడించడం సమంజసం కాదని, ఈ క్రీడల్లో తమ శరీర ధారుడ్యం వల్ల ట్రాన్స్జెండర్లు సులభంగా పైచేయి సాధిస్తారని వరల్డ్ అథ్లెటిక్స్ అభిప్రాయపడింది. కాగా, చాలా రోజులుగా అమెరికా సహా చాలా దేశాల్లో పలువురు మహిళా అథ్లెట్లు బహిరంగంగానే ట్రాన్స్జెండర్లతో పోటీ పడాల్సి రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము ఎంతో కష్టపడి పోటీలకు సమాయత్తం అవుతామని, కానీ తమ కన్నా శారీరక ధారుడ్యం కలిగి ఉన్న ట్రాన్స్జెండర్ల చేతిలో ఓడిపోవడం ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని సదరు క్రీడాకారిణులు తెలిపారు. ఈ క్రమంలో వరల్డ్ అథ్లెటిక్స్ తీసుకున్న నిర్ణయాన్ని వీరంతా స్వాగతిస్తున్నారు. మరి ట్రాన్స్జెండర్ల కోసం భవిష్యత్తులో మరో విభాగం ఏర్పాటు చేస్తారేమో చూడాలి.