న్యూఢిల్లీ: జాతీయ నేషనల్ స్క్వాష్ ఛాంపియన్షిప్ నుంచి తప్పుకోవడాన్ని భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి దీపిక పల్లికల్ సమర్ధించుకుంది. ఈ టోర్నీ నిర్వాహకులు ప్రైజ్మనీ విషయంలో వివక్ష చూపిస్తున్నారని పల్లికల్ ఆరోపించింది.
పురుషులతో సమానంగా తమకూ సమాన ప్రైజ్మనీ ఇచ్చినప్పుడే జాతీయ టోర్నీలో పాల్గొంటానని దీపిక స్పష్టం చేసింది. పురుషులకు ఎక్కువ.. మహిళలకు తక్కువ ప్రైజ్మనీ ఉండటంతో ఈసారి కూడా జాతీయ ఛాంపియన్షిప్కు దీపిక దూరంగా ఉండనుంది.

'గత మూడేళ్ళు టోర్నీకి ఎందుకు దూరంగా ఉన్నానో ఈసారి కూడా అదే కారణం. పీఎస్ఏ ప్రొఫెషనల్ సర్క్యూట్లో చాలా టోర్నీల్లో సమానంగా ప్రైజ్మనీ ఇస్తున్నారు. అందుకు మేం అర్హులం కూడా. పురుషులు, మహిళలకు తేడా ఎందుకో అర్థంకావడం లేదు. కేరళలో టోర్నీ ఆడాలనుకున్నా. కానీ ఈసారి కూడా దూరంగా ఉండబోతున్నా'నని దీపిక తెలిపింది.
కాగా, ఈ టోర్నీ తిరువనంతపురంలో జులై 7న ప్రారంభమైంది. ప్రస్తుతం నేషనల్స్లో.. టైటిల్ నెగ్గితే పురుషులకు రూ.1.20 లక్షలు, మహిళలకు రూ.50 వేలు ఇస్తున్నారు.