న్యూఢిల్లీ: ఇరాన్ దేశంలో సాంప్రదాయ చట్టాలకు పెద్ద పీట వేస్తారు. అలాంటి తమ సాంప్రదాయ చట్టాలకు గౌరవం ఇవ్వకుంటే ఎంతవారికైనా శిక్ష తప్పదని ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది. గత ఏడాది జూన్లో రాజధాని టెహ్రాన్లో ఇరాన్-ఇటలీ జట్ల మధ్య జరిగిన వాలీబాల్ మ్యాచ్ చూసేందుకు ప్రయత్నించిన బ్రిటిష్ సంతతికి చెందిన ఇరానియన్ గోంచ్ గవామి (25) అనే యువతికి స్ధానికి కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది.
గోంచ్ గవామి విచారణపై బ్రిటిష్ ప్రభుత్వం తమ అభ్యంతరాలను వెలిబుచ్చింది. ఇస్లామిక్ చట్టాల ద్వారా ఇరాన్లో ప్రజలు తమ స్వేఛ్చను కోల్పోతున్నారని పేర్కొంది. గోంచ్ గవామి సోదరుడు ఇమామ్ గవామి మాట్లాడుతూ కోర్టు ఇచ్చిన తీర్పు తమను షాక్కు గురి చేసిందని అన్నారు.
గోంచ్ గవామి యూనివర్సిటీ ఆఫ్ లండన్ స్కూల్లో గ్రాడ్యుయేట్. ఇరాన్లోని వీధి బాలలకు సహాయం చేసేందుకు కొన్ని నెలల క్రితమే ఇరాన్కు వచ్చిందని ఆమె సోదరుడు తెలిపాడు. ఇరాన్లో పురుషులు ఆడే ఆటలకు ఆడవారిని బ్యాన్ చేశారు.
దీనికి నిరసనగా కొంత మంది మహిళలతో వాలీ మ్యాచ్ జరిగే ఫ్రీడమ్ స్టేడియంలోకి వెళ్లేందుకు గోంచ్ గవామి ప్రయత్నించింది. ఇందుకు గాను గోంచ్ గవామిని పోలీసులు అరెస్టు చేసినట్లు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ 'ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్' పేర్కొంది.
ఐతే.. వాలీబాల్ మ్యాచ్ చూసేందుకు గాను ఆమె ఇరాన్ అధికార వ్యవస్థపై తప్పుడు ప్రచారం చేసేందుకు ప్రయత్నించిందని కోర్టు పేర్కొంది. గవామీపై మోపిన అభియోగాలను నిర్ధారిస్తూ కోర్టు ఆమెకు ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుపై అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ 'ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్', బ్రిటిష్ ప్రభుత్వాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.