హైదరాబాద్: గత ఆసియా గేమ్స్లో స్వర్ణంతో సహా నాలుగు పతకాలను స్క్వాష్ ప్లేయర్లు భారత్కు అందించిన సంగతి తెలిసిందే. అయితే, వచ్చే నెలలో జకార్తా వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్లో స్క్వాష్ ప్లేయర్లు కనీసం ఒక్క పతకమైనా నెగ్గుతారా? అనే అనుమానాలు రేగుతున్నాయి.
ఇందుకు కారణం లేకపోలేదు. గత మార్చిలో భారత స్క్వాష్ రాకెట్ సమాఖ్య (ఎస్ఆర్ఎఫ్ఐ)తో విభేదాల కారణంగా కోచ్ అచ్రఫ్ ఎల్ కరార్గుయ్ వైదొలిగాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు మరో కొత్త కోచ్ను వెదకడంలో ఫెడరేషన్ పూర్తిగా విఫలమైంది.
దీంతో ఈ ఏడాది ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో కోచ్ లేకుండానే బరిలోకి దిగిన స్క్వాష్ ప్లేయర్లు పతకం సాధించడంలో పూర్తిగా విఫలమయ్యారు. దీంతో ఆగస్టులో జరిగే ఆసియా క్రీడల్లో కూడా కోచ్ లేకుండానే బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి.
మరోవైపు భారత్ స్టార్ స్క్వాష్ ప్లేయర్లు సౌరవ్ ఘోశాల్, జోష్న చినప్ప ఇంగ్లాండ్లో శిక్షణ పొందుతుండగా.. టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ దీపిక పల్లికల్ ఈజిప్టులో కరార్గుయ్ వద్ద సాధన చేస్తోంది. అయితే, వీరికి ప్రభుత్వమే ఫండింగ్ చేస్తుండటం విశేషం.
హరీందర్ పాల్ సంధు కూడా సౌరవ్ ఘోశాల్తో కలిసి ఇంగ్లాండ్లోనే శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే, ఆసియా గేమ్స్లో ఓ జట్టుగా బరిలోకి దిగాల్సిన తాము ఇలా వేర్వేరు చోట్ల శిక్షణ తీసుకోవడం కాస్త ఇబ్బందిగా ఉందని భారత స్టార్ స్క్వాష్ ప్లేయర్ సౌరవ్ ఘోశాల్ పేర్కొన్నాడు.
"టీమ్ ఈవెంట్లలో జట్టుగా పాల్గొనే తామంతా ఒకేచోట ట్రైనింగ్ తీసుకుంటే బాగుండేది. అయితే, ప్రస్తుతం పరిస్థితులు అందుకు తగినట్లు లేవు. మాజీ కోచ్ అచ్రఫ్ ఎల్ కరార్గుయ్ ఓ అద్భుతమైన వ్యక్తి, అతడి స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తి మళ్లీ ఇంతవరకు భారత స్క్వాష్ రాకెట్ సమాఖ్యకు దొరకలేదు" అని అన్నాడు.