న్యూఢిల్లీ: ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన భారత బాక్సర్ మేరీకోమ్ రియో ఒలింపిక్స్కు దూరమైంది. ఒలింపిక్స్ అవకాశం కోసం చివరి వరకు ఎన్నో ఆశలు పెట్టుకున్న మేరీ కోంకు తీరని నిరాశ ఎదురైంది.
రియోలో పోటీచేసేందుకు వైల్డ్కార్డు ఇవ్వాలని భారత ఒలింపిక్ సంఘంతో పాటు ఐబా అడ్హాక్ కమిటీ చేసిన విజ్ఞప్తిని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం(ఐఓసీ) నిరాకరించింది. మేరీకోమ్కు వైల్డ్కార్డు ఇచ్చేందుకు ఐఓసీ ఒప్పుకోలేదని అడ్హాక్ కమిటీ ఛైర్మన్ కిషన్ నర్సీ వెల్లడించారు.

ఐఓసీ నిబంధనల ప్రకారం.. చివరి రెండు ఒలింపిక్స్లో ఎనిమిది అంతకంటే ఎక్కువ మంది బాక్సర్లు పోటీపడిన దేశానికి వైల్డ్కార్డు ఇవ్వకూడదు. అయితే లండన్ ఒలింపిక్స్లో మాత్రమే భారత్ నుంచి ఎనిమిది మంది బాక్సర్లు పాల్గొన్నారు. దీంతో ఈ ఏడాది రియోలో భారత్కు వైల్డ్కార్డు ఇచ్చేందుకు ఐఓసీ నిరాకరించింది.
ప్రపంచ ఛాంపియన్షిప్ రెండోరౌండ్లో ఓటమి పాలవడంతో మేరీకోమ్ రియోకు అర్హత సాధించలేకపోయిన విషయం తెలిసిందే. కాగా, ఒలింపిక్స్ అవకాశం దక్కలేదన్న వార్త విని తన గుండెబద్దలైందని మేరీ కోమ్ తెలిపారు. తాను తన ఆవేదనను నియంత్రించుకోలేకపోయానని చెప్పారు. ఈ నిర్ణయాన్ని అంగీకరించినప్పటికీ.. తాను బాక్సింగ్ను ఇప్పుడే వదిలేదని స్పష్టం చేశారు.