కోల్ కత్తా: ఇటీవలి కాలంలో భారత క్రికెట్ జట్టు ఫీల్గిండ్ చాలా మెరుగుపడిందని, దీంతో ప్రపంచ కప్ లో ఫేవరెట్ జట్టు అదేనని వెస్టిండీస్ క్రికెట్ మాజీ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ అభిప్రాయపడ్డారు. దాంతో ప్రపంచ కప్ లో భారత్ విజయావకాశాలు మెరుగు పడ్డాయని ఆయన అన్నారు. పవర్ ప్లే పేరుతో క్రికెట్ పై జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన గత రాత్రి పాల్గొన్నారు. భారత క్రికెటర్లలో మానసికంగా కూడా ఎంతో మార్పు వచ్చిందని, మైదానంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారని, కోచ్ గ్యారీ కిర్ స్టన్ వంటివారికి ఆ క్రెడిట్ దక్కుతుందని ఆయన అన్నారు. మంచి ఫీల్డింగ్ ప్రపంచ కప్ పోటీల్లో విజయాన్ని సాధించి పెడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తాను ముందుండి ధోనీ జట్టును నడిపిస్తున్నాడని, నాయకుడు తాను కూడా బాగా ఆడాలని ఆయన అన్నారు. మంచి ఫీల్డింగ్ ప్రపంచ కప్ పోటీల్లో విజయాన్ని సాధించి పెడుతుందన్న వివియన్ రిచర్డ్స్ అభిప్రాయంతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా ఏకీభవించారు. ప్రపంచ కప్ పోటీల్లో ఫీల్డింగ్ అత్యంత కీలకమైందని ఆయన అన్నారు. ప్రపంచ కప్ ను గెలుచుకునే సత్తా భారత్ కు ఉందని, ఆస్ట్రేలియా మరో ఫేవరెట్ జట్టు అని, బౌలర్ బ్రెట్ లీ దూకుడుగా ఆడి సత్తా చాటుతాడని ఆయన అన్నారు. భారత మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, కపిల్ దేవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.