
హైదరాబాద్: దక్షిణకొరియాలోని ప్యాంగ్ చాంగ్ నగరంలో 23వ వింటర్ ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. ప్యాంగ్చాంగ్ నగరంలోని ప్రధాన ఒలింపిక్ స్టేడియంలో కళాకారులు ప్రత్యేక ప్రదర్శనలు, బాణసంచా వెలుగుల మధ్య వింటర్ ఒలింపిక్స్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి.
ఈ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలకు దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జే యిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరోవైపు ఉత్తర కొరియా అధ్యక్షుడు సోదరి, భార్య కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రారంభ, ముగింపు కార్యక్రమాలు జరిగే ప్యాంగ్ చాంగ్ జాతీయ స్టేడియానికి పైకప్పు లేదు.
దీంతో ఎముకలు కొరికే చలిలో, విపరీతమైన చలిగాలులను తట్టుకుంటూ వివిధ జట్ల కవాతును, సాంస్కృతిక ప్రదర్శనలను వీక్షించడం ప్రేక్షకులకు సవాల్గా మారింది. 30 ఏళ్ల తర్వాత ప్యాంగ్ చాంగ్లో జరుగుతోన్న ఈ వింటర్ ఒలింపిక్స్ కోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు.
ప్రారంభ వేడుకలు మొదలైన కాసేపటికే ఉత్తర, దక్షిణ కొరియాకు చెందిన అథ్లెట్లు ఒకే జెండా పట్టుకుని మైదానంలో కలిసి రావడం కొరియన్లను ఒకింత ఉద్వేగభావానికి గురి చేసింది. ఫిబ్రవరి 9 నుంచి 25 వరకూ జరిగే ఈ వింటర్ ఒలింపిక్స్లో 92 దేశాలకు చెందిన 3వేల మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు.
ప్రతి దేశానికి చెందిన జట్టు ఆటగాళ్లు ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. తమ జాతీయ పతాకాన్ని చేత పట్టుకుని రెట్టించిన ఉత్సాహంతో క్రీడాకారులు స్టేడియంలో సందడి చేశారు. భారత్ నుంచి ఇద్దరు క్రీడాకారులు శివ్కేశవన్, జగదీశ్ మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శివకేశవన్ భారత జాతీయ పతకాన్ని చేతపట్టాడు.
మొత్తం 15 క్రీడల్లో 102 ఈవెంట్లలో నిర్వాహకులు పోటీలు నిర్వహించనున్నారు. ఈ గేమ్స్లో ఐస్ హాకీ, ఆల్పైన స్కీయింగ్, బయోథ్లాన్, బాబ్ స్లీగీ, క్రాస్ కంట్రీ స్కీయింగ్, కర్లింగ్, ఫిగర్ స్కేటింగ్, ఫ్రీస్టయిల్ స్కేటింగ్, లూగే, నోరాడిక్ కంబైన్డ్, స్పీడ్ స్కేటింగ్, స్కెలిటన్, స్కీజంపింగ్, స్నోబోర్డింగ్ ఉన్నాయి.

భారత్ నుంచి లుజ్లో కేశవన్, క్రాస్ కంట్రీ స్కీయింగ్లో జగదీష్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ వింటర్ ఒలింపిక్స్కు దక్షిణ కొరియాలో ప్రముఖంగా కనిపించే మంచు పులి, ఏషియాటిక్ నల్ల ఎలుగుబంటిని మస్కట్లుగా నిర్ణయించారు. దీంతో సూహా రాంగ్ పేరుతో మంచుపులి, బాండాబీ పేరుతో నల్ల ఎలుగ ప్యాంగ్ చాంగ్ నగరంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా సందడి సందడి చేస్తున్నాయి.
ఈ వింటర్ ఒలింపిక్స్ను రిలయన్స్ జియో టీవీ యాప్.. జియో టీవీలో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. అంతర్జాతీయ ఒలింపిక్స్ అసోసియేషన్ (ఐఓసీ) తన వెబ్సైట్ ద్వారా ఒలింపిక్ చానెల్లో, యూట్యూబ్ ఛానెల్లో కూడా క్రీడలను ప్రసారం చేస్తోంది.
వింటర్ ఒలింపిక్స్పై సోషల్ మీడియాలో ఇలా: