
హైదరాబాద్: దక్షిణకొరియాలోని ప్యాంగ్ చాంగ్ నగరంలో జరుగుతోన్న వింటర్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్ హాజరుకానున్నారు. ఈ మేరకు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ అధికారిక ప్రకటన చేసింది.

ఫిబ్రవరి 9వ తేదీన ప్యాంగ్ చాంగ్ నగరంలో జరిగిన ప్రారంభ వేడుకలకు అమెరికా వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ తన ప్రతినిధి బృందంతో హాజరైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 24వ జరిగే వింటర్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలకు ఇవాంకా ట్రంప్ తన ప్రతినిధుల బృందంతో హాజరుకానుంది.
ఈ సందర్భంగా ఇవాంకా ట్రంప్ మాట్లాడుతూ 'అమెరికా ప్రతినిధుల బృందంతో కలిసి ప్యాంగ్ చాంగ్లో జరిగే వింటర్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలకు హాజరు కావడం గౌరవంగా భావిస్తున్నా. 'టీమ్ యుఎస్ఏ' అభినందించబోతున్నందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా. వింటర్ ఒలింపిక్స్లో వారి టాలెంట్, తెగింపు అమెరికాను ఉన్నతంగా నిలబెట్టింది. మాకు స్ఫూర్తిగా నిలిచారు' అని అన్నారు.
వింటర్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలకు హాజరయ్యే అమెరికా ప్రతినిధుల బృందంలో తూర్పు, దక్షిణ ఆసియా, టెర్రరిజంకు సంబంధించి సెనెట్ విదేశీ వ్యవహారాల సబ్ కమిటీ ఛైర్మన్ జేమ్స్ ఈ రీచ్తో పాటు ప్రెస్ సెక్రటరీ సారా హెచ్ శాండర్స్... యునైటెడ్ నేషన్స్ కమాండ్ కమాండర్ జనరల్ విన్సెంట్ కె బ్రూక్స్లు ఉన్నారు.
సెనెట్ అడ్మినిస్ట్రేషన్ అధికారి వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ అమెరికా ప్రతినిధుల బృందం వింటర్ ఒలింపిక్స్లో పాల్గొన్న అమెరికా అథ్లెట్లను అభినందించడంతో పాటు అమెరికా-దక్షిణకొరియా దేశాల మధ్య సంబంధాలపై కూడా చర్చించనున్నారు.