వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో సంచలనాలపై సంచలనాలు నమోదవుతున్నాయి . మహిళల సింగిల్స్లో మరో స్టార్ ప్లేయర్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రపంచ రెండో ర్యాంకర్, రెండో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) ప్రిక్వార్టర్స్లో ఓటిమిపాలైంది. అమెరికాకే చెందిన 23 ఏళ్ల ఎమ్మా నవారో చేతిలో 4-6, 3-6తో తేడాతో పరాజయాన్ని చవిచూసింది.
వింబుల్డన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఆది నుంచే సంచనాలు నమోదవుతున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన చెక్ రిపబ్లిక్ అమ్మాయి మర్కెట వొండ్రుసోవా తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. నిన్న ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ స్వియాటెక్ (పోలాండ్) కూడా టోర్నీ నుంచి నిష్క్రమించింది. తాజాగా 20 ఏళ్ల కోకో గాఫ్ కూడా నాకౌటైంది.

74 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో కోకో గాఫ్ అనవసర తప్పిదాలతో వరుస సెట్లను కోల్పోయింది. మరోవైపు గొప్ప ప్రదర్శన చేసిన నవారో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. కాగా, క్వాలిఫయర్ లులూ సన్ (న్యూజిలాండ్) కూడా క్వార్టర్స్కు అర్హత సాధించింది. బ్రిటన్ ప్లేయర్ రదుకాను లులూ 6-2, 5-7, 6-2తో ఓడించింది. 2010 తర్వాత ఓ క్వాలిఫయర్ వింబుల్డన్ గ్రాండ్స్లామ్లో క్వార్టర్స్ చేరడం ఇదే మొదటిసారి.
మెన్స్ సింగిల్స్లో కూడా ఊహించని ఫలితం వచ్చింది. నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) కూడా ఇంటిబాట పట్టాడు. ప్రిక్వార్టర్స్లో 13వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ చేతిలో 6-4, 7-6 (7-4), 4-6, 6-7 (3-7), 3-6తో ఓటమిపాలయ్యాడు. తొలి రెండు సెట్లలో గెలిచిన జ్వెరెవ్ చివరి మూడు సెట్లను కోల్పోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మరోవైపు ముసెటి (ఇటలీ), డిమెనార్ (ఆస్ట్రేలియా) కూడా క్వార్టర్స్ చేరారు.