
రాజ్బోంగ్షీ తెగకు చెందిన స్వప్న బర్మన్
రాజ్బోంగ్షీ తెగకు చెందిన దిగువ మధ్య తరగతి కంటే తక్కువస్థాయి కుటుంబం.. ఏడేళ్ల కిందట తండ్రికి గుండెపోటు రావడంతో మంచానపడ్డాడు. కేవలం ఆటలోనే కాక వేరే సవాళ్లను కూడా చాలానే ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా స్వప్న ఆర్థిక ఇబ్బందుల్ని, ఇతర అడ్డంకుల్ని అధిగమించి ఆటలో ఎదిగింది. ఆసియా గేమ్స్లో అద్భుతం చేసింది. ఆమె రెండు కాళ్లలోనూ అదనంగా ఒక్కో వేలు ఉంటుంది. మామూలు బూట్లు ధరిస్తే ఈ వేళ్ల వల్ల పరుగు తీస్తున్నపుడు, సాధన చేస్తున్నపుడు విపరీతమైన నొప్పి ఉంటుంది.

డిజైన్ చేయించుకునే స్థోమత లేదు
ఎన్నో రకాలు షూలు ప్రయత్నించినా సమస్యకు పరిష్కారం లభించలేదు. ప్రత్యేకంగా షూలు డిజైన్ చేయించుకునే స్థోమత ఆమెకు లేదు. అయినా పాత షూటలతో ఇబ్బంది పడుతూనే అలాగే ఆసియా గేమ్స్కు వచ్చింది. అలాగే పోటీల్లోనూ పాల్గొంది. స్వప్న చిన్నప్పట్నించి మొండిఘటం. ఒకసారి అనుకుంటే దానిని సాధించకుండా వదిలిపెట్టే రకం కాదు. పతకం గెలవకుంటే ఇంటికి రావొద్దు అని తన తల్లి చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకుని ఏకంగా స్వర్ణంతో మెరిసింది. దీనికి తోడు కొన్ని రోజుల నుంచి ఆమెను పంటి నొప్పి వేధిస్తోంది. ఒక దశలో పోటీలో పాల్గొనడమే కష్టంగా మారింది.

బుగ్గలపై ఒక ప్లాస్టర్ వేసుకుని
అయినప్పటికీ స్వప్న పట్టు వీడలేదు. నొప్పి బాధ తగ్గించుకునేందుకు ఒక బుగ్గలపై ఒక ప్లాస్టర్ వేసుకుని బరిలోకి దిగిందామె. కాళ్లలో, నోటిలో బాధను భరిస్తూనే పోటీలో అత్యుత్తమ ప్రదర్శన చేసి స్వర్ణం గెలిచింది. వెన్ను నొప్పికి ప్రతి నెలా ఇంజెక్షన్ కోసం ముంబై వెళ్లి వచ్చేది. ఎన్ని కష్టాలు ఎదురైనా ఏనాడు క్రీడను వదిలిపెట్టాలని అనుకోలేదు అని జల్పాయ్గురి జిల్లా అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి ఉజ్జల్ దాస్ తెలిపారు. ఆటలో మేటి అయిన స్వప్నకు దైవభక్తి కూడా ఎక్కువే. తన ఇంటి పక్కన కాళిమాత దేవాలయం కట్టేందుకు వచ్చిన ప్రైజ్మనీని మొత్తం ఖర్చు చేసింది.

సందడిగా స్వప్న ఇల్లు
గతేడాది భువనేశ్వర్లో ఆసియా అథ్లెటిక్స్ టోర్నీ ముగిశాక ఇంటికి వచ్చిన ఆమె.. ఆ ఆలయ నిర్మాణం ఎంతవరకూ వచ్చిందో పరిశీలించింది. దేవాలయం శంకుస్థాపన కోసం చివరిసారి తన ఇంటికి వచ్చిన స్వప్న మళ్లీ స్వర్ణంతో వెళ్తోంది. ఆసియన్ అథ్లెటిక్స్లో 5942 పాయింట్లు సాధించిన స్వప్న ఇప్పుడు 6 వేల క్లబ్లో చేరినందుకు చాలా సంతోషంగా ఉందని దాస్ పేర్కొన్నారు. తాజాగా ఆసియా గేమ్స్లో స్వప్న స్వర్ణం సాధించడంతో ఘోసాపార గ్రామం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. ముఖ్యంగా స్వప్న ఇంట్లో సంబురాలు అంబరాన్నంటాయి. రెండు రూమ్ల ఇళ్లు వచ్చిపోయేవారితో సందడిగా మారింది.

మెడల్ గెలవకుండా ఇంటికి రాను
స్వప్న తల్లి కాళీమాత పూజ చేసి అందరికీ స్వీట్లు పంచుతూ తన ఆనందాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా స్వప్న తల్లి బసానా దేవి మాట్లాడుతూ "ఈసారి మెడల్ గెలవకుండా ఇంటికి రాను అని స్వప్న ముందే చెప్పింది. మా కుటుంబం ఎన్ని కష్టాలు పడిందో ఆమెకు తెలుసు. తండ్రితో రిక్షా తొక్కడం మాన్పించింది. ఈ పతకం గెలిచాక మా పరిస్థితిలో మార్పు వస్తుందేమో చూడాలి" అని అన్నారు. మరోవైపు పంటినొప్పి, వెన్ను నొప్పి బాధించినా ఇంతటి ఘనత సాధించిన స్వప్నను పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభినందించారు.


Click it and Unblock the Notifications
