37వ జాతీయ క్రీడలను గోవాలో ప్రధాన మంత్రి మోడీ ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు. దక్షిణ గోవాలోని పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. క్రీడారంగంలో భారతదేశం విజయ శిఖరాలను తాకుతున్న తరుణంలో జాతీయ క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మన దగ్గర క్రీడా నైపుణ్యాలకు కొదవేలేదని, దేశం అనేక మంది ఛాంపీయన్లని సృష్టించించదని చెప్పారు. తమ ప్రభుత్వం క్రీడాకారులకు ఆర్థిక ప్రోత్సాహాకాలు అందించేందుకు పథకాల్లో ఎన్నో మార్పులను తీసుకొచ్చిందని ఈ సందర్భంగా ప్రధాని చెప్పారు. తొమ్మిదేళ్ల క్రితం నాటి బడ్జెట్తో పోలిస్తే.. ఈ ఏడాది క్రీడలకు కేటాయించిన బడ్జెట్ మూడు రెట్లు ఎక్కువుందని ఆయన అన్నారు. 2030లో యూత్ ఒలింపిక్స్, 2036లో ఒలింపిక్స్ నిర్వహణకు సిద్ధమని తాను అంతర్జాతీయ ఒలింపిక్స్ అసోసియేషన్కు చెప్పినట్లు ఈ సందర్భంగా మోదీ వివరించారు.
28 రాష్ట్రాల నుంచి అథ్లెట్లు...:ఈ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావన్ టి, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, గోవా క్రీడల మంత్రి గోవింద్ గౌడ్, పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. గోవాలో జాతీయ క్రీడలను నిర్వహించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అందుకే ఈ క్రీడల ప్రారంభోత్సవం కన్నుల పండువగా జరిగింది. కళాకారుల విన్యాసాలు ఇక్కడికి విచ్చేసిన అందరిని ఆకట్టుకున్నాయి. గోవాలోని ఐదు నగరాల్లో 43కి పైగా వివిధ క్రీడా విభాగాల్లో 28 రాష్ట్రాల నుంచి అథ్లెట్లు ఈ క్రీడల్లో పాల్గొంటున్నారు. ఇందులో మపుసా, మార్గోవా , పనాజీ, పోండా, వాస్కో వంటి పోటీలను నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా పదివేల మందికి పైగా అథ్లెట్లు ఈ పోటీలో పాల్గొంటున్నట్లు సమాచారం. వీరిలో 49 శాతం మంది మహిళలు ఉండడం విశేషం. రాష్ట్ర జట్లతో పాటు, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, సర్వీసెస్కు చెందిన క్రీడా జట్లు కూడా
జాతీయ క్రీడల్లో పాల్గొననున్నాయి. గత నాలుగు ఎడిషన్లలో సర్వీసెస్ విజేతలుగా నిలిచింది.

37వ నేషనల్ గేమ్స్కి గోవా ఆతిథ్యం ...:35వ ఎడిషన్ నేషనల్ గేమ్స్ 2015లో కేరళలో జరిగాయి. నిజానికి గోవాలో 2016లోనే జాతీయ క్రీడలు జరగాల్సి ఉండేది. 36వ ఎడిషన్ నేషనల్ గేమ్స్ హక్కులను గోవా సొంతం చేసుకుంది. కానీ, పలుమార్లు వాయిదా పడడంతో అది కుదరలేదు. ఇప్పుడు ఆ అవకాశం మళ్లీ గోవాకే దక్కింది. అందుకే, చివరకు 37వ నేషనల్ గేమ్స్కి గోవా ఆతిథ్యం ఇస్తోంది. కాగా ఈ జాతీయ క్రీడలు నవంబర్ 9 వరకు కొనసాగుతాయి. దేశంలోని అత్యుత్తమ క్రీడాకారులను, అథ్లెట్లను వెలుగులోకి తెచ్చే ప్రయత్నమే ఈ 'నేషనల్ గేమ్స్ చేస్తుంది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఈ క్రీడలను నిర్వహిస్తోంది.