
హైదరాబాద్: కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ఓ సరికొత్త ఛాలెంజ్ను తెరపైకి తీసుకొచ్చారు. భారతీయులు ఫిట్నెస్గా ఉండాలనే ఉద్దేశ్యంతో 'హమ్ ఫిట్తో ఫిట్ ఇండియా ఫిట్' అనే ఛాలెంజ్కు ఆయన శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రాథోడ్ తన కార్యాయలంలోనే 10 డిప్స్ కొడుతూ షూట్ చేసిన వీడియోను సోషల్మీడియా ద్వారా షేర్ చేశారు.
ప్రతీ ఒక్కరూ ఇలా ఫిట్నెస్ మంత్రలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వీడియోలో 'ప్రధాని మోడీని చూసినప్పుడల్లా స్పూర్తి పొందుతాను. ఆయన చాలా శక్తివంతుడు. రోజంతా పనిచేస్తునే ఉంటారు. భారత ప్రజలు ఆరోగ్యంగా, ఫిట్గా ఉండాలని ఆయన ఎప్పుడు పరితపిస్తుంటారు. ఫిట్నెస్పై ప్రధాని మాట్లాడిన కొన్ని మాటలు నన్ను ఆలోచింపజేశాయి' అని ఆయన తెలిపారు.
'ఫిట్నెస్ కోసం చేసే కసరత్తులకు సంబంధించి వీడియో, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. అలాగే మీ మిత్రులకు చాలెంజ్ చేయండి. నేను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్లకు సవాల్ విసురుతున్నాను' అని ట్వీట్ చేశాడు. ఈ ఛాలెంజ్కు నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.