హైదరాబాద్: డ్రగ్ పరీక్షలో పాటిజివ్గా తేలిన అథ్లెట్ల డేటాను ఎందుకు డిలీట్ చేశారని రష్యా ఒలింపిక్ సంఘాన్ని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది టోక్యో వేదికగా జరగనున్న ఒలింపిక్స్లో రష్యా క్రీడాకారులు పాల్గొనేది అనుమానంగా మారింది.
క్రీడల చరిత్రలోనే దీనిని ఓ అతిపెద్ద చీటింగ్ స్కాండల్గా అభివర్ణించింది. ఈ క్రమంలో రష్యా అథ్లెట్లపై తీవ్ర చర్యకు సిద్ధమైంది. అసలేం జరిగిందంటే...
వచ్చే ఏడాది టొక్యో వేదికగా ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో రష్యాలోని పలువురు అథ్లెట్లకు డోప్ టెస్టులు నిర్వహించారు. అయితే, ఈ డోప్ టెస్టుల్లో పాజిటివ్గా తేలిన వారి డేటాను మాస్కోలోని ల్యాబ్లో భద్రపరిచారు. అలా భద్రపరిచిన డేటాను డిలీట్ చేసినట్లు రష్యా ఆరోపణలు ఎదుర్కొంటోంది.
The Best FIFA Football Awards 2019: పూర్తి విజేతలు వీరే
ఈ నేపథ్యంలో ఈ అంశంపై మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ రష్యా ఒలింపిక్ సంఘానికి లేఖ రాసింది. అందులో డ్రగ్ టెస్టులో పాటిజివ్గా తేలిన అథ్లెట్ల డేటాను ఎలా డిలీట్ చేశారని వాడా ప్రశ్నించింది. రష్యా ఒలింపిక్ సంఘం నుంచి సంతృప్తికరమైన వివరణ రాని పక్షంలో టోక్యో ఒలింపిక్స్ నుంచి రష్యాను నిషేధించాలని వాడా భావిస్తోంది.
రష్యన్ అథ్లెటిక్ ఫెడరేషన్ను సస్పెండ్ చేయాలని ఇప్పటికే ఐఏఏఎఫ్ ఒక నిర్ణయానికి వచ్చింది. ఒలింపిక్స్తో పాటు అన్ని ప్రపంచ చాంపియన్షిప్ పోటీల నుంచి కూడా రష్యా క్రీడాకారులు నిషేధం ఎదుర్కొనే అవకాశం ఉంది. దీనిపై రష్యా యాంటీ డోపింగ్ ఏజెన్సీ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ యూరీ గనుస్ స్పందించారు.
2015 డోపింగ్ కుంభకోణంలో మాస్కో ల్యాబ్ నుండి వాడాకు పంపిన డేటా తారుమారైదంటూ వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. వాడా నిర్ణయం తనను నిరాశకు గురి చేసిందని చెప్పిన ఆయన రష్యన్ క్రీడలకు సంభావ్య పరిణామాలు ఎక్కువేనని చెప్పుకొచ్చారు.