
హైదరాబాద్: 23వ వింటర్ ఒలింపిక్స్కు దక్షిణకొరియాలోని ప్యాంగ్ చాంగ్ నగరం ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ కోసం అక్కడికి చేరుకున్న క్రీడాకారులను వైరస్ ఆందోళన గురి చేస్తోంది. అంతేకాదు ఈ ఒలింపిక్స్ నుంచి ఇప్పటికే 1200 మంది సెక్యూరిటీ గార్డ్స్ తమ విధులను ఉపసంహరించుకున్నారు.
చలి తీవ్రత ఎక్కువ అవడంతో ఇక్కడ నొరొవైరస్ విస్తరించిందని నిర్వాహకులు మంగళవారం ప్రకటించారు. మొత్తం భద్రతా సిబ్బందిలో ఇప్పటివరకు 42 మంది వాంతులు, డయేరియాకు గురయ్యారని కొరియన్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల అండ్ ప్రివెన్షన్ (కేసీడీసీ) అధికారిక ప్రకటన చేసింది.
అంతేకాదు మంగళవారం తొలుత 32గా నమోదైన కేసులు బుధవారం నాటికి ఈ సంఖ్య 54కు చేరిందని తెలిపింది. ఇక, గురువారం నాటికి ఈ సంఖ్య 128 చేరినట్లు కేసీడీసీ పేర్కొంది. వింటర్స్ ఒలింపిక్స్ భద్రత కోసం వచ్చిన సెక్యూరిటీ గార్డ్స్ ఇందులో ఎక్కువ మంది ఉన్నట్లు తెలిపింది. వీళ్లను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
వీరంతా నొరొవైరస్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్టు వైద్యులు వెల్లడించారు. నొరొవేరస్ అనేది తీవ్రమైన అంటువ్యాధి. ఇది భోజనం, నీళ్ల ద్వారా విస్తరిస్తుందని వైద్యులు తెలిపారు. '1200 మంది భద్రతా సిబ్బందిని తమ విధుల నుంచి విముక్తి కలిగించాం. వారి స్థానంలో 900 మంది మిలిటరీ సైనికులను నియమించాం' అని పియాంగ్చాంగ్ ఒలింపిక్ నిర్వాహక కమిటీ అధికారి ఒకరు చెప్పారు.
మరోవైపు ఈ వైరస్ ఎందువల్ల వచ్చేందనే దానిని కనుగొనేందుకు ఆరోగ్య సిబ్బంది ప్రయత్నిస్తున్నారని ఆ అధికారి పేర్కొన్నారు. వైరస్ కారణంగా సెక్యూరిటీ కంపెనీకి చెందిన గార్డ్స్కు ప్యాంగ్ చాంగ్ నగరంలోని ప్రధాన క్రీడా నగరానికి దూరంగా ఉన్న యూత్ ట్రెయినింగ్ సెంటర్లో బస ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.