పారిస్ ఒలింపిక్ క్వాలిఫయిర్స్లో పోటీపడేందుకు నిర్వహిస్తున్న ట్రయిల్స్లో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ రచ్చరచ్చ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఒకేరోజు రెండు వెయిట్ కేటగిరీల్లో పోటీపడేందకు అనుమతించాలని నిర్వాహకులను కోరింది. నిర్వాహకులను ఒప్పించడానికి వినేశ్ ఫొగాట్ చేసిన హంగామాతో సోమవారం ట్రయిల్స్కు దాదాపు రెండున్నర గంటల పాటు ఆటంకం కలిగింది. మొత్తంగా వినేశ్కు రెండు విభాగాల్లో పోటీపడేందుకు అనుమతించారు.
50, 53 కేజీల కేటగిరీల్లో పాల్గొన్న వినేశ్ ఫొగాట్ ఒక్క విభాగంలోనే విజయం సాధించింది. 50 కిలోల విభాగంలో శివానిపై వినేశ్ 11-6తో గెలిచింది. ఈ గెలుపుతో వచ్చే నెలలో బిష్కెక్లో జరగనున్న ఆసియా క్వాలిఫయిర్స్ టోర్నీకి అర్హత సాధించింది. అయితే 53 కేజీ కేటగిరీలోనూ పాల్గొన్న వినేశ్ అంజు చేతిలో 0-10తో చిత్తుగా ఓడింది. ఈ కేటగిరీలో మొత్తంగా మూడో స్థానంతో సరిపెట్టుకుంది.

భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ సింగ్కు వ్యతిరేకంగా రెజ్లర్ల చేసిన నిరసనలో వినేశ్ ఫొగాట్ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే నిరసనకు ముందు ఆమె 53 కేజీలో పోటీపడేది. కానీ ఈ కేటగిరీలో ఇప్పటికే అంతిమ్ ఒలింపిక్ కోటా స్థానం సంపాదించింది. దీంతో వినేశ్ బరువు తగ్గి 50 కేజీలకు మారింది.
అయితే 53 కేజీ కేటగిరీలో ఒలింపిక్ క్రీడల సమీపంలో అత్యుత్తమ రెజ్లర్లు నలుగురికి మరోసారి అడ్హక్ కమిటీ నిర్వహిస్తుంది. అందులో గెలిచిన వారు అంతిమ్తో పోటీ పడాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ఇప్పటికే వెల్లడించింది. కానీ దీనిపై రాతపూర్వక హామీ ఇవ్వాలని వినేశ్ ఫొగాట్ సోమవారం డిమాండ్ చేసింది. అయితే వినేశ్ ప్రవర్తనతో ట్రయల్స్ నిర్వహణకు ఆటంకం కలగడంపై ఇతర రెజ్లర్లు అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు ట్రయిల్స్తో పాల్గొన్న తర్వాత వినేశ్ ఫొగాట్ డోప్ పరీక్షకు తన నమూనాను ఇవ్వకుండా వెళ్లినట్లు తెలుస్తోంది.
కాగా, సెలక్షన్ ట్రయిల్స్లో టోక్యో ఒలింపిక్స్ పతక విజేతలు బజ్రంగ్ పునియా, రవి దహియాల ఓటమిపాలైన విషయం తెలిసిందే. పారిస్ ఒలింపిక్స్ అర్హత రేసు నుంచి ఈ స్టార్ రెజ్లర్లు నిష్క్రమించారు.