న్యూ ఢిల్లీ: ఆసియా గేమ్స్ 2018 స్వర్ణ విజేత భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్కు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఆసియా గేమ్స్ టోర్నీని విజయంతో ముగించి ఇంటికి తిరిగి వస్తూనే ఎయిర్ఫోర్ట్లోనే నిశ్చితార్థం కూడా చేసేసుకుంది. ఇదే ఉత్సాహంతో వరల్డ్ ఛాంపియన్షిప్లో కూడా పతకం సాధించాలనుకున్న ఫోగట్ సిస్టర్కు చుక్కెదురైంది. తాజాగా మోచేతి గాయం కారణంగా వరల్డ్ ఛాంపియన్షిప్ నుంచి వైదొలగాల్సి వస్తుందన్నట్లు ప్రకటించింది.
లక్నోలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో వినేశ్ ఫోగట్ గాయపడింది. ఆ గాయం తీవ్రత అధికంగా ఉండడంతో డాక్టర్ సూచన మేరకు వరల్డ్ ఛాంపియన్షిప్ టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది వినేశ్ ఫోగట్. 2016లో కూడా ఇలాగే గాయపడింది వినేశ్ ఫోగట్. 2016 రియో ఒలింపిక్స్లో గాయపడినప్పటి నుంచి వినేశ్ ఫోగట్కు తోడుగా ఉన్నాడు సోమ్వీర్ రతి.
తన ప్రియురాలికి సపోర్టుగా ఉంటూ తిరిగి రెజ్లింగ్పై దృష్టి పెట్టేందుకు కారణమైయ్యాడు. అంతకుముందు నుంచే ప్రేమలో ఉన్న వీరిద్దరూ, పెద్దల సమక్షంలో త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. గాయపడిన వినేశ్ ఫోగట్ స్థానంలో ఆమె సోదరి రీతూ ఫోగట్ను బరిలో దించాలని భావిస్తోంది రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. వినేశ్ ఫోగట్ స్థానంలో మరో స్టార్ రెజ్లర్ పింకీని 53 కేజీల కేటగిరిలో బరిలో దింపాలని భావించినా, ఆమె అందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు.
దాంతో రీతూ ఫోగట్ను ఎంపిక చేశారు. 50 కేజీల కేటగిరిలో రీతూ ఫోగట్ వరల్డ్ ఛాంపియన్షిప్లో బరిలో దిగబోతోంది. గతంలో అండర్ 23 వరల్డ్ ఛాంపియన్షిప్లో రీతూ ఫోగట్ సిల్వర్ మెడల్ సాధించింది. కొద్ది రోజుల క్రితం టర్కీలో విమానం ఆలస్యం కావడంతో ఆసియా క్రీడల్లో పాల్గొనే ఛాన్స్ కోల్పోయారు రీతూ ఫోగట్, ఆమె మరో సోదరి సంగీతా ఫోగట్. వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలు అక్టోబర్ 20 నుంచి 28 దాకా హంగేరీలో జరగబోతున్నాయి.