న్యూఢిల్లీ: ఒలింపిక్ గేమ్స్ లో అద్భుత ప్రతిభ కనబరిచిన ప్రముఖ బాక్సర్ విజేందర్ సింగ్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. ఢిల్లీకి చెందిన అర్చనతో మంగళవారం వివాహం జరగనున్నట్లు స్వయంగా ప్రకటించాడు. అర్చనతో చాలాకాలంగా విజేందర్ సింగ్ స్నేహం నెరపుతున్నాడు. అరఫుర గేమ్స్ లో కాంస్య పతకం సాధించిన విజేందర్ ఆదివారం స్వదేశం వచ్చాడు. వచ్చీ రాగానే ప్రెస్ మీట్ పెట్టి తన పెళ్లి గురించిన వివరాలు తెలిపాడు. నేను మే 17న స్వస్థలమైన కలువాస్ లో పెళ్లి చేసుకుంటున్నట్టు చెప్పాడు. 18వ తారీఖున విందు ఉంటుందని కూడా చెప్పాడు. నాకు కాబోయే భార్య పేరు అర్చన. ఆమె ఢిల్లీకి చెందిన మహిళ. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఇది పూర్తిగా వ్యక్తిగత విషయమని ఆయన చెప్పాడు.25 ఏళ్ల హర్యానా బాక్సర్ బీజింగ్ ఒలింపిక్స్ లో, ఆ తర్వాత వరల్డ్ చాంపియన్ షిప్ లోనూ కాంస్య పతకాన్ని కొల్లగొట్టాడు. గత ఏడాది జరిగిన ఆసియా గేమ్స్ లో బంగారు సతకం సాధించాడు. గతంలో పెళ్లి విషయంపై వచ్చిన వార్తలను ఖండించిన విజేందర్ అప్పటికి ఇంకా సంబంధం కుదరలేదని చెప్పాడు. పెళ్లయిన కొద్ది రోజులకే విజేందర్ బిజీ కానున్నాడు. వచ్చే నెలలో ఆసియా చాంపియన్ షిప్, ఆ తర్వాత వరల్డ్ చాంపియన్ షిప్ పోటీలు జరగనున్నాయి. కాగా అర్చన వయస్సు 23 సంవత్సరాలు. అర్చన కాంగ్రెసు పార్టీ కార్యకర్త సురిందర్ సింగ్ కూతురు. వీరిది ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ నగర్. అర్చన ప్రస్తుతం ఢిల్లీ బ్రిటిష్ ఎంబసీలో పని చేస్తోంది.