మాంచెస్టర్: భారత స్టార్ విజేందర్ సింగ్ బల్గేరియా బాక్సర్ సామెట్ హ్యూసెనోవ్కు గట్టి షాకిచ్చాడు. ఆరు రౌండ్లు సాగాల్సిన పోటీలో రెండు రౌండ్లలోనే ప్రత్యర్థిని నాకౌట్ చేసి ప్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్లో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుని బాక్సింగ్లో తనకు తిరుగులేదని విజేందర్ మరోసారి నిరూపించాడు.
తొలి రౌండులో 3-0 ఆధిక్యాన్ని సాధించిన విజేందర్, రెండో రౌండు పోరు ప్రారంభమైన 30 సెకన్లలోనే సామెట్ను నాకౌట్ చేశాడు. విజేందర్ కుడిచేయి వేగంగా వెళ్లి సామెట్ ముఖాన్ని తాకగా, కిందపడిపోయిన అతనిక లేవలేదు.
అంతకు రెండు రోజుల ముందు విజేందర్ మాట్లాడుతూ... మూడు రౌండ్లలోనే ప్రత్యర్థి కథ ముగిస్తానని చెప్పాడు. అయితే, విజేందర్ అంత సమయం కూడా తీసుకోలేదు. శనివారం ప్రొ బాక్సింగ్ బౌట్లో బల్గేరియా బాక్సర్ సామెట్ హ్యుసెనోవ్ను రెండో రౌండ్లోనే నాకౌట్ చేశాడు.
తాజా విజయంతో కలిపి కెరీర్లో అతడు వరుసగా మూడు నాకౌట్లతో హ్యాట్రిక్ పూర్తి చేశాడు. శనివారం మొదటి సారి ఆరు రౌండ్ల బౌట్లో పాల్గొన్న విజేందర్.. ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తొలి రౌండ్లోనే ప్రత్యర్థిపై వరుస పంచ్లతో దాడికి దిగాడు.
విజేందర్ ఎముకలు విరగ్గొట్టి భారత్ పంపిస్తానని బీరాలు పలికిన సామెట్ ఆరంభం నుంచే రక్షణాత్మక వైఖరి ప్రదర్శించాడు. రెండో రౌండ్లో విజేందర్ మరింత రెచ్చిపోయాడు. అతడి బలమైన పంచ్ల వర్షానికి సామెట్ దిమ్మ తిరిగిపోయింది. సామెట్ తేరుకునేలా కనిపించకపోవడంతో రిఫరీ సాంకేతికంగా నాకౌట్ అయినట్లు ప్రకటించాడు.