బెంగళూరు: సీనియర్ అథ్లెటిక్స్ కోచ్, ప్రతిష్ఠాత్మక ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎన్ లింగప్ప కన్నుమూశారు. ఆయన వయస్సు 95 సంవత్సరాలు. బెంగళూరులోని తన నివాసంలో ఆయన మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఎలాంటి అనారోగ్యం లేదని, వృద్ధాప్యం కారణంగా లింగప్ప కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రన్నింగ్ మిషన్గా పేరుపొందిన అథ్లెటిక్ క్రీడాకారిణి అశ్వినీ నాచప్ప గురువు ఆయన. మధ్యతరగతి కుటుంబానికి చెందిన అశ్వినీ నాచప్పలోని ప్రతిభను గుర్తించి, దేశం గర్వించదగ్గ అథ్లెటిక్ క్రీడాకారణిగా ఆమెను తీర్చిదిద్దారు లింగప్ప. మరో అథ్లెటిక్ క్రీడాకారిణి వందనా రావు కూడా ఆయన శిష్యురాలే.
జాతీయ మారథాన్ ఛాంపియన్ డీవై బిరాధర్, ఉదయ ప్రభు, పీసీ పొన్నప్ప వంటి అగ్రశ్రేణి క్రీడాకారులను లింగప్ప తీర్చిదిద్దారు. 1970లో బ్యాంకాక్లో నిర్వహించిన ఆసియా గేమ్స్లో 400 మీటర్ల పరుగు పందెంలో వెండి పతాకాన్ని అందుకున్న ఘనత పీసీ పొన్నప్పకు ఉంది. అలాంటి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు, అథ్లెటిక్స్ను తయారు చేశారు లింగప్ప. 1954లో మనీలాలో నిర్వహించిన ఆసియా గేమ్స్లో 10 కిలోమీటర్ల వాకథాన్లో లింగప్ప స్వయంగా పాల్గొని, క్వాలిఫై అయ్యారు. అదే ఏడాది ఢిల్లీలో నిర్వహించిన తొలి నేషనల్ గేమ్స్లో 10 కిలోమీటర్ల వాకథాన్లో వెండి పతాకాన్ని సాధించారు.
టీమిండియాకే కాదు.. ఆ జట్టుకూ ఉన్నాడో డీకే.. అతనే!
క్రీడా రంగానికి లింగప్ప చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఆయనను ద్రోణాచార్య అవార్డుతో సత్కరించింది. 2014లో అప్పటి రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. కర్ణాటక ప్రభుత్వం ఆయనకు అనేక పురస్కారాలను అందజేసింది. 1987 దసరా అవార్డు, 1994లో రాజ్యోత్సవ అవార్డు, కర్ణాటక ఒలింపిక్స్ అసోసియేషన్ నుంచి 2002లో అత్యుత్తమ కోచ్ అవార్డును లింగప్ప అందుకున్నారు. అదే ఏడాది ప్రతిష్ఠాత్మక కెంపేగౌడ అవార్డును కూడా లింగప్ప కు దక్కింది. ఆయన మరణం పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.