స్ఫూర్తిదాయక విజయం..
అదే సమయంలో మహిళల హాకీ విభాగంలో భారత్ స్ఫూర్తిదాయక విజయాన్ని అందుకుంది. గ్రూప్ దశలో శుక్రవారం నాటి మ్యాచ్లో ఐర్లాండ్ను మట్టి కరిపించిన భారత మహిళా జట్టు తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఇవ్వాళ దక్షిణాఫ్రికాను ఓడించింది. చివరి వరకూ పోరాటాన్ని సాగించింది. ఆ మ్యాచ్లో భారత మహిళా జట్టు 4-3 గోల్స్ తేడాతో చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది. ప్రతి క్వార్టర్ కూడా నరాలు తెగే ఉత్కంఠతకు గురి చేసింది. చివరి క్వార్టర్లో సాధించిన గోల్తో విజయం తలుపు తట్టింది భారత జట్టు.. తన క్వార్టర్ ఫైనల్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
నాలుగింట్లో మూడు గోల్స్ ఆమెవే..
దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో భారత్ మొత్తం నాలుగు గోల్స్ చేయగా.. అందులో మూడు ఒకే ప్లేయర్ బ్యాట్ నుంచి జాలువారినవే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దక్షిణాఫ్రికా ప్లేయర్ల దూకుడును అడ్డుకుంటూ.. వారి సృష్టించిన వలయాన్ని ఛేదించుకుంటూ ఒకే ప్లేయర్ మూడు గోల్స్ చేశారు. ఆమే- వందన కఠారియా. 29 సంవత్సరాల వయస్సున్న సీనియర్ ప్లేయర్. 2013లో మహిళల జూనియర్ ప్రపంచకప్ హాకీలో రజత పతకాన్ని గెలుచుకున్న జట్టులో సభ్యురాలు. ఆ మ్యాచ్లో టాప్ స్కోరర్. 2014లో ఆసియన్ గేమ్స్, 2016లో రియో డీ జనేరియోలో ఏర్పాటైన ఒలింపిక్స్లో భారత హాకీ సీనియర్ జట్టుకు ప్రాతినిథ్యాన్ని వహించారు.
వందన కఠారియా హ్యాట్రిక్..
ఈ మ్యాచ్లో హాకీ ప్లేయర్ వందన కఠారియా (Vandana Katariya) చరిత్ర సృష్టించారు. ఒలింపిక్స్ గేమ్స్లో ఒక మహిళా హాకీ ప్లేయర్.. ఒకే మ్యాచ్లో మూడు గోల్స్ చేసిన ఏకైక ప్లేయర్గా తన పేరును చరిత్రలో లిఖించుకున్నారామె. తొలి క్వార్టర్, రెండో క్వార్టర్, నాలుగో క్వార్టర్లో ఒక్కొక్కటి చొప్పున మూడు గోల్స్ కొట్టారు. ఆమె ఆడిన షాట్లకు దక్షిణాఫ్రికా గోల్ కీపర్ వద్ద సమాధానమే లేకపోయింది. బుల్లెట్ వేగంతో దూసుకెళ్లిన బంతులను అడ్డుకోవడంలో విఫలం అయ్యారు. మరో గోల్ను నేహా సాధించారు. మూడో క్వార్టర్లో నేహా ఈ గోల్ చేశారు.
ప్రతి పోరులోనూ హోరాహోరీ..
మూడో క్వార్టర్ మొదట్లోనే లభించిన పెనాల్టీ కార్నర్ను భారత్ గోల్గా మలిచింది. పెనాల్టీ కార్నర్ను నేహా గోల్గా మలిచారు. దీనితో భారత్ ఆధిక్యత మళ్లీ 3-2గా మారింది. దీనితో దక్షిణాఫ్రికా ఒత్తిడిలోకి వెళ్లింది. ఈ దశలో దక్షిణాఫ్రికా మళ్లీ గోల్ కొట్టింది. స్టార్ ప్లేయర్ మ్యారిజెన్ గోల్ చేశారు. ఆధిక్యత మళ్లీ సమమైంది. 3-3గా నిలిచింది. నాలుగో క్వార్టర్లో భారత్ మళ్లీ గోల్ చేసింది. ఈ సారి కూడా వందన కఠారియా గోల్ కొట్టారు. ఈ మ్యాచ్లో ఆమె మూడు గోల్స్తో హ్యాట్రిక్ సాధించారు.. ఇంకో తొమ్మిది నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా వందన కఠారియా గోల్ చేయడంతో ఇక దక్షిణాఫ్రికా తేరుకోలేకపోయింది. భారత్ గోల్ పోస్ట్పై పదేపదే దాడులు చేసినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. 4-3 గోల్స్ తేడాతో భారత్ విజయం సాధించింది. తన క్వార్టర్ ఫైనల్స్ ఆశలను సజీవంగా నిలుపుకొంది.


Click it and Unblock the Notifications












