బీజింగ్: అమెరికా అథ్లెట్ జస్టిన్ గాల్టిన్ నుంచి ఎదురైన తీవ్రమైన పోటీని 'జమైకా చిరుత' ఉసేన్ బోల్ట్ సమర్థంగా ఎదుర్కొన్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో పురుషుల 100 మీటర్ల పరుగులో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకొని, తాను స్ప్రింట్ రారాజునని మరోసారి నిరూపించుకున్నాడు.
బోల్ట్ 9.79 సెకన్లలో లక్ష్యాన్ని చేరి స్వర్ణం సాధించగా, గాల్టిన్ 9.80 సెకన్లతో రజత పతకాన్ని అందుకున్నాడు. కెనడాకు చెందిన ఆండ్రె గ్రాస్కు కాంస్య పతకం లభించింది. 100 మీటర్లు, 200 మీటర్ల పరుగుతోపాటు రిలేలోనూ ప్రపంచ రికార్డులను సాధించి, అంతర్జాతీయ అథ్లెటిక్స్పై తనకంటూ ఒక ముద్ర వేసుకున్న బోల్ట్కు ప్రపంచ ఛాంపియన్షిప్స్లో ఇది తొమ్మిదో స్వర్ణం.
మరో రెండు రజత పతకాలు కూడా అతని ఖాతాలో ఉన్నాయి. ఒలింపిక్స్లో ఆరు స్వర్ణాలు, ప్రపంచ రిలేలో రజతం, సిఎసి చాంపియ్షిప్స్లో స్వర్ణం, కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం, జూనియర్ అథ్లెటిక్స్ మీట్లో ఒక స్వర్ణం, 2 రజతం, యూత్ గేమ్స్లో ఒక స్వర్ణం, ప్రపంచ కప్లో ఒక రజతం చొప్పున పతకాలను అతను ఇప్పటికే సంపాదించాడు.
వచ్చే ఏడాది రియో డి జెనీరోలో జరిగే ఒలింపిక్స్లో పాల్గొని, పతకాలను సాధించడమే తన లక్ష్యమని, ఆ తర్వాతే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తానని ఇప్పటికే ప్రకటించిన బోల్ట్.. అనుకున్నది సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
షెల్లీ ఆన్కు మూడో టైటిల్
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో జమైకా డబుల్ ధమాకాతో స్ప్రింట్ విశ్వవిజేతగా అవతరించింది. పురుషుల 100 మీటర్ల పరుగులో ఆదివారం అమెరికా అథ్లెట్ జస్టిన్ గాట్లిన్ నుంచి ఎదురైన పోటీని తట్టుకున్న 'జమైకా చిరుత' ఉసేన్ బోల్ట్ స్వర్ణ పతకాన్ని సాధించగా, సోమవారం మహిళల 100 మీటర్ల పరుగులో షెల్లీ ఆన్ ఫ్రేజర్ ప్రైస్ విజేతగా నిలిచింది.
2009, 2013 సంవత్సరాల్లో స్ప్రింట్ టైటిళ్లు సాధించిన షెల్లీ ఆన్ ముచ్చటగా మూడోసారి ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే మహిళగా గుర్తింపు సంపాదించింది.