లెగ్జింటన్: అమెరికాలో దారుణం జరిగింది. ఒలింపిక్ స్పింటర్ టైసన్ గే కుమార్తె ట్రినిటీ గే(15) దారుణ హత్యకు గురైంది. కెంటకీ యూనివర్సిటీ మెడికల్ సెంటర్లో ఆమెను అత్యంత దారుణంగా కాల్చిచంపినట్టు టైసన్ గే ప్రతినిధి మార్క్ వెట్ మోర్ తెలిపారు.
రెస్టారెంట్ పార్కింగ్ ప్రాంతంలో ట్రినిటీ మృతదేహాన్ని గుర్తించినట్టు అసోసియేటెడ్ ప్రెస్ తన వార్తాకథనంలో వెల్లడించింది. లెగ్జింజన్ పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం (అక్టోబర్ 16) తెల్లవారు జామున నాలుగు గంటల ప్రాతంలో కాల్పులు జరిగాయని తెలిపారు.

కెంటకీ యూనివర్సిటీకి అతి సమీపంలోని రెస్టారెంట్ పార్కింగ్ వద్ద రెండు వాహనాల్లోని వ్యక్తుల మధ్య కాల్పులు జరిగినట్టు ప్రత్యక్షసాక్షి ఒకరు వెల్లడించారని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఇద్దరిని ప్రశ్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో ట్రినిటీ గే పాత్ర ఏంటన్నది ఇంకా తెలియాల్సి ఉందన్నారు. మరో వాహనం కోసం గాలిస్తున్నామని, దర్యాప్తు కొనసాగుతుందని లెగ్జింటన్ పోలీసులు వెల్లడించారు. కాగా, గత మూడు సమ్మర్ ఒలింపిక్స్లో అమెరికా తరుపున టైసన్ గే ప్రాతినిధ్యం వహించాడు.
2012 లండన్ ఒలింపిక్స్ లో నాలుగు వందల మీటర్ల రిలే పరుగు పందెంలో వెండి పతకం గెలిచిన అమెరికా అథ్లెట్ల బృందంలో టైసన్ గే ఒకడిగా ఉన్నాడు. ఆ తర్వాత అతడు 2013లో స్టెరాయిడ్స్ తీసుకుని దొరికిపోయాడు. 33ఏళ్ల టైసన్ గే రియో ఒలింపిక్స్లో కూడా నిరాశపర్చాడు.
రియోలో నాలుగు వందల మీటర్ల రిలే పరుగు పందెంలో బ్యాటన్ మార్చుకునే క్రమంలో అనర్హతకు గురయ్యాడు. అయినా అమెరికా మూడో స్ధానంలో నిలిచింది. ఇక ట్రినిటీ కూడా తండ్రి మాదిరిగానే స్పింటర్గా మారింది. అనేక రాష్ట్ర స్థాయిలో పోటీల్లో పాల్గొంది.
ట్రినిటీ మృతి పట్ల కెంటకీ హైస్కూల్ అథ్లెటిక్ అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేసింది. కాల్పుల్లో గాయాలు పాలైన ట్రినిటీని ఓ ప్రైవేట్ వాహనంలో యుకే ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లుగా నిర్ధారించారు.