న్యూఢిల్లీ: పరాజయ పరంపరకు చెక్ పెట్టిన ఢిల్లీ డైనమోస్ అదే దూకుడు సాగించాలని భావిస్తున్నది. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో కేరళ బ్లాక్ బస్టర్స్ తో జరిగే మ్యాచ్ లో విజయం సాధించి టాప్ 4లో తన స్థానం బలోపేతం చేసుకోవాలని తలపోస్తున్నది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం జంబ్రొట్టా జట్టు మూడోస్థానంలో నిలిచింది. ఏడు మ్యాచ్లు ఆడిన తర్వాత కూడా ఆరో స్థానంతో సతమతమవుతున్న కేరళ బ్లాక్ బస్టర్స్ సైతం ఢిల్లీపై గెలుపొంది ముందడుగు వేయాలని భావిస్తున్నది.
ఇటాలియన్ వరల్డ్ కప్ విన్నర్ జియాంలుకా జంబ్రొట్టా జట్టు రెండు విజయాలు, నాలుగు మ్యాచ్ల్లో డ్రా, ఒక మ్యాచ్లో ఓటమి పాలైంది. స్టీవ్ కొప్పెల్ మేనేజ్మెంట్లోని కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టు సైతం రెండు మ్యాచ్ ల్లో విజయం, మూడింట డ్రా, రెండు మ్యాచ్ లలో ఓటమితో తొమ్మిది పాయింట్లు గలిగి ఉంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్లలో ఎఫ్ సి గోవాపై విజయంతో ఢిల్లీ ఫుట్ జోష్లో కొనసాగుతూ నైతిక స్థైర్యం, ఆత్మ విశ్వాసంతో ఉంది. బ్రెజిలియన్ మార్సిలిన్హో, రిచర్డ్ గాడ్జె చెరో గోల్ చేయడంతో ఎఫ్ సి గోవాపై ఢిల్లీ డైనమోస్ జట్టుపై విజయం సాధించింది.
గత ఏడాది సెమీ ఫైనల్స్లో వెనుదిరగడానికి కారణమైన గోవాపై కసి తీర్చుకున్నది. కానీ సొంతగడ్డపై సారధి కం మిడ్ ఫీల్డ్ మార్షల్ ఫ్లోరెంట్ మాలౌదా ఉండటం ఢిల్లీకి కలిసొచ్చే అంశం. ఢిల్లీ డైనమోస్ జట్టుకు సొంత అభిమానుల మద్దతు పుష్కలం. ఢిల్లీ ఇదే దూకుడును కొనసాగించాలని భావిస్తున్నది. ఎఫ్ సి గోవాపై మాదిరిగానే కేరళపై ఆధిపత్యం కొనసాగించేందుకు సిద్ధమైంది. జంబ్రొట్టా జట్టులో మార్సిలిన్హోకు గాడ్జె, బాదారా బాద్డీ భాగస్వామ్యం ఎంతో సానుకూల అంశం కానున్నది.
ఇక సచిన్ టెండూల్కర్ సహ యజమానిగా గల కేరళ బ్లాక్ బస్టర్స్లో మాత్రం ఒకింత ఆందోళన కొనసాగుతున్నది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ ఎఫ్ సి జట్టుతో మ్యాచ్ డ్రాగా మాత్రమే ముగిసింది. కోచిలో చెన్నైయిన్తో జరిగిన మ్యాచ్ గోల్స్ లేకుండా డ్రాగా ముగిసింది. గత మ్యాచ్లలో ఓటమి కారణంగా జట్టు పెర్పార్మెన్స్పై కొప్పెల్ విశ్వాసం సన్నగిల్లింది

పుణె సిటీ ధర్మరాజ్పై రెండు మ్యాచ్ల వేటు
ముంబై: పుణె సిటీ ఎఫ్ సి ప్లేయర్ రావణన్ ధర్మరాజ్ పై ఎఐఎఫ్ఎఫ్ క్రమశిక్షణా సంఘం రెండు మ్యాచ్ల నిషేధం విధించింది. ఇక చెన్నైయిన్ ఎఫ్ సి దుదు ఒమాంగ్బెమిపై రూ.40 వేల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నది. పుణె తరఫున ఆడిన రావణన్ ఎఐఎఫ్ఎఫ్ క్రమశిక్షణా సంఘం కోడ్ నిబంధనలను ఉల్లంఘించి.. ప్రత్యర్థి జట్టు సభ్యుడి పట్ల హింసాత్మకంగా వ్యవహరించాడని వీడియో క్లిప్పింగ్ ఆధారంగా కమిటీ నిర్ణయం తీసుకుంది. ఐఎస్ఎల్ టోర్నీలో వీడియో క్లిప్పింగ్ ఆధారంగా నిషేధం విధించడం ఇదే మొదటిసారి. దీని ప్రకారం నవంబర్ మూడో తేదీన గోవాతో జరిగిన మ్యాచ్కు దూరంగా ఉండగా, ఆరో తేదీన అట్లెటికో డీ కోల్కతా జట్టుతో జరిగే మ్యాచ్ కూడా దూరం కానున్నాడు.
పొరపాట్లు సరిదిద్దుకుంటాం: బాలె
వార్సా: తమ జట్టులో గల పొరపాట్లు, లోపాలు సరిచేసుకుంటామని రియల్ మాడ్రిడ్ స్టార్ ప్లేయర్ గారెథ్ బాలె తెలిపాడు. వార్సాలో పోలండ్కు చెందిన లెగియా వార్సా జట్టుతో జరిగిన 3 - 3 స్కోర్ తేడాతో డ్రాగా ముగిసిన తర్వాత బాలె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. డిఫెండింగ్ చాంపియన్స్ రియల్ మాడ్రిడ్ పూర్తిగా మ్యాచ్ సమయాన్నివ్రుథాచేసింది. ఫస్టాఫ్లో 2 - 0 స్కోర్ తేడాతో ఆధిక్యం సాధించింది. కానీ వార్సా జట్టు తనదైన శైలిలో మ్యాచ్పై పట్టు బిగించడంతో డ్రాగా ముగించడానికి పరిమితమైంది. తాము మ్యాచ్ ఫలితం పట్ల సంత్రుప్తిగా లేమని, ద్రుష్టిని కేంద్రీకరించడంలో వైఫల్యం వల్లే ఇలా జరిగిందని బాలె వ్యాఖ్యానించాడు.