కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు.క్రీడా రంగానికి రూ.3,442.32 కోట్లు కేటాయించారు. దీనిలో అత్యధికంగా ప్రాజెక్ట్ ఖేలో ఇండియాకు రూ. 900 కోట్లు కేటాయించారు. మొత్తంగా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ సారి క్రీడలకు బడ్జెట్లో స్వల్ప పెరుగుదల కనిపించింది..
వచ్చే నెలలో పారిస్ ఒలింపిక్స్ ముగియనుండటం, కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలకు మరో రెండేళ్ల పాటు సమయం ఉండటంతో రూ.45.36 కోట్లు మాత్రమే అదనంగా కేటాయించారు. గ్రామీణస్థాయిలో క్రీడలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఖేలో ఇండియా'కు గతంలో కంటే రూ.20 కోట్లు పెంచారు. 2023-23కు ఖేలో ఇండియాకు రూ.596.39 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత 2023-24కు గానూ రూ.1000 కోట్లుగా పెంచారు.

2018లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎక్సలెన్స్ సెంటర్లను ఏర్పాటు చేసి క్రీడలను ప్రోత్సహిస్తున్నారు. 2020లో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ కూడా ప్రారంభించారు. 2023లో ఖేలో ఇండియా పారా గేమ్స్ కూడా మొదలయ్యాయి.
కాగా, ఈ బడ్జెట్లో జాతీయ క్రీడా సమాఖ్యకు రూ. 15 కోట్లు పెంచి రూ.340 కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా స్టేడియాలను నిర్వహిస్తూ, అంతర్జాతీయ పోటీలకు క్రీడాకారులను సిద్ధం చేస్తున్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు రూ.822.60 కోట్లు కేటాయించారు. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా), నేషనల్ డోప్ టెస్టింగ్ లాబొరేటరీ (ఎన్డీటీఎల్) బడ్జెట్లలో స్వల్ప పెరుగుదల కనిపించింది. నాడాకు రూ.22.30 కోట్లు, ఎన్డీటీఎల్కు రూ.22 కోట్లు కేటాయించారు.