దోహా వేదికగా జరుగుతున్న ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్లు సత్తా చాటారు. స్ప్రింటర్ గోమతి మరిముత్తు, షాట్పుటర్ తజిందర్ సింగ్ తూర్ స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. చెన్నైకు చెందిన గోమతి సోమవారం జరిగిన మహిళల 800 మీటర్ల పరుగులో అగ్రస్థానంలో నిలిచింది. రెండు నిమిషాల 2.70 సెకన్లలో రేసు పూర్తి చేసి స్వర్ణం సాధించింది.
షాట్పుట్లో తజిందర్ సింగ్ తూర్.. గుండును 20.22 మీటర్ల దూరం విసిరిన స్వర్ణం కైవసం చేసుకున్నాడు. జావెలిన్ త్రోలో శివ్పాల్ సింగ్ రజతం గెలిచాడు. శివ్పాల్ జావెలిన్ను 86.23 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. మహిళల 400 మీటర్ల హర్డిల్స్లో సరితా 57.22 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. దీంతో ఆమె కాంస్య పతకాన్ని సాధించింది. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్లో జాబిర్ 49.13 సెకన్లలో గమ్యానికి చేరి కాంస్య పతకం గెలిచాడు.
రెండో రోజు సోమవారం రెండు స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం భారత్కు ఐదు పతకాలు వచ్చాయి. ఆదివారం తొలి రోజు భారత్కు రెండు రజతాలు, మూడు కాంస్య పతకాలు వచ్చాయి. మొత్తంగా భారత్ ఖాతాలో 10 పతకాలు ఉన్నాయి.