ప్యోంగ్యాంగ్: రియో ఒలింపిక్స్లో దేశం తరుపున ప్రాతినిధ్యం వహించి రిక్త హస్తాలతో వెనుదిరిగిన క్రీడాకారులకు ఉత్తరకొరియా చీఫ్ కిమ్ జాంగ్ ఉన్ శిక్ష సిద్ధం చేశారు. ఈ ఏడాది బ్రెజిల్లోని రియో నగరంలో జరిగిన ఒలింపిక్స్కు వెళ్లే ముందు ఐదు స్వర్ణాలు, 12 ఇతర (రజత, కాంస్య) పతకాలు తీసుకురావాలని కిమ్ జాంగ్ ఉన్ ఉత్తరకొరియా స్పోర్ట్స్ కమీషన్కు ఆదేశాలు జారీ చేశారు.
అయితే రియో ఒలింపిక్స్లో తొమ్మిది క్రీడల్లో పాల్గొన్న 31 మంది క్రీడాకారులు రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, రెండు కాంస్య పతకాలు సాధించారు. రియో ఒలింపిక్స్లో ఎవరైతే పతకాలు సాధించారో ఆ క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కలిగిన ఇల్లు, చక్కటి రేషన్ సదుపాయంతో పాటు ఒక కారు, ఇంకా గిఫ్టులు అందించనున్నారు.

అదే విధంగా ఒలింపిక్స్లో పాల్గొని పతకాలు సాధించని క్రీడాకారులను బొగ్గుగనుల్లో పని చేయాలని కిమ్ జాంగ్ ఉన్ ఆదేశించనున్నాడని టెలిగ్రాఫ్ కథనం ప్రచురించింది. దీంతో పాటు పతకాలు తీసుకురాని క్రీడాకారులకు సౌకర్యాలు లేని ఇల్లు, రేషన్ తగ్గించడం, బొగ్గుగనుల్లో పనికి పెట్టనున్నారు.
క్రీడాకారుల పట్ల కిమ్ జాంగ్ ఉన్ ఇంతలా ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం దక్షిణ కొరియాకు 9 స్వర్ణాలతో 21 పతకాలు రావడమే. వరల్డ్ గేమ్స్గా భావించే ఒలింపిక్స్లో పతకాలు సాధించని క్రీడాకారులను కిమ్ శిక్ష విధించి చరిత్ర సృష్టించాడు. గతంలో కూడా అథ్లెట్లకు కిమ్ శిక్ష విధించిన దాఖలాలు ఉన్నాయి.
2010 పుట్బాల్ వరల్డ్ కప్లో పోర్చుగల్పై దక్షిణ కొరియా 7-0 తేడాతో ఓటమి పాలవడంతో జట్టులోని ఆటగాళ్లను బొగ్గు గనుల్లో పని చేయించాడని అపవాదు కూడా ఉంది.