భారత క్రీడారంగంలో మరో విషాదం చోటుచేసుకుంది. దేశానికి పతకాలు తెచ్చిపెడతారనుకున్న ఇద్దరు యువ క్రీడాకారిణులు అర్ధాంతరంగా తనువు చాలించారు. కేరళలోని కొల్లాంలో ఉ్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI) శిక్షణ కేంద్రం హాస్టల్లో ఇద్దరు యువ క్రీడాకారిణులు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా, క్రీడా వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
ఘటన నేపథ్యం.. ఆ సెషన్లో ఏం జరిగింది?
గురువారం సాయంత్రం ట్రైనింగ్ సెషన్కు హాజరుకావాల్సిన 16 ఏళ్ల కబడ్డీ క్రీడారిణి, 18 ఏళ్ల అథ్లెట్ మైదానానికి రాలేదు. దీంతో తోటి క్రీడాకారులు వారి కోసం హాస్టల్కు వెళ్లారు. అక్కడ మొదటి అంతస్తులోని ఓ గది లోపల నుండి గడియ పెట్టి ఉండటంతో అనుమానం వచ్చి తలుపులు పగులగొట్టారు. లోపల సీలింగ్ ఫ్యాన్కు ఇద్దరూ వేలాడుతూ కనిపించడంతో అందరూ షాక్కు గురయ్యారు. తక్షణమే వారిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

సూసైడ్ నోట్.. తల్లిదండ్రులకు క్షమాపణలు
పోలీసులు ఘటనా స్థలంలో ఇద్దరు బాలికల సంతకాలు ఉన్న ఓ ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. అందులో వారు పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నందుకు తమ తల్లిదండ్రులను క్షమాపణలు కోరారు. అయితే, ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాన్ని ఆ లేఖలో స్పష్టంగా వివరించలేదని తెలుస్తోంది."ప్రస్తుతానికి తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేదా అనుమానాలు మాకు అందలేదు" అని కొల్లాం ఈస్ట్ ఎస్హెచ్ఓ పుష్పకుమార్ వెల్లడించారు.
పోలీసు దర్యాప్తు: పలు కోణాల్లో ఆరా
పోలీసులు ఈ ఘటనను 'అనుమానాస్పద మృతి'గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరణానికి గల అసలు కారణాలను తెలుసుకోవడానికి పోస్ట్మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. హాస్టల్లో సీనియర్ల వేధింపులు ఏమైనా ఉన్నాయా? లేదా కోచ్ల నుండి ఒత్తిడి ఎదురైందా? అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. మరణానికి ముందు వారు ఎవరితో మాట్లాడారు అనే విషయాలను తెలుసుకోవడానికి వారి మొబైల్ ఫోన్ రికార్డులను పరిశీలిస్తున్నారు.
సాయి (SAI) కేంద్రం స్పందన
ఈ కేంద్రం ఇన్ఛార్జ్ రాజీవ్ థామస్ మాట్లాడుతూ.. ఇక్కడ సుమారు 40 మంది బాలికలు వివిధ క్రీడల్లో శిక్షణ పొందుతున్నారని తెలిపారు. క్రీడాకారిణుల మానసిక స్థితిని గమనించడానికి ప్రత్యేక కౌన్సెలర్లు ఉన్నప్పటికీ ఇలా జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణకు సహకరిస్తామని సాయి యాజమాన్యం వెల్లడించింది. ప్రతిభ కలిగిన క్రీడాకారిణులు ఇలాంటి విపరీత నిర్ణయాలు తీసుకోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అథ్లెట్లపై ఉండే విపరీతమైన పోటీ ఒత్తిడి, మానసిక సమస్యలు లేదా వ్యక్తిగత కారణాలు ఈ ఘోరానికి దారితీసి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.