
జకార్తా: ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న ఆసియా గేమ్స్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. మూడో రోజైన మంగళవారం పురుషుల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఇద్దరు భారతీయులు పతకాలు సాధించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఫైనల్లో 16 ఏళ్ల సౌరభ్ చౌదరి షూటింగ్లో తొలి స్వర్ణాన్ని అందించాడు.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
మరో షూటర్ అభిషేక్ వర్మ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. షూటింగ్లో భారత్కు తొలి స్వర్ణం అందించిన సౌరభ్ చౌధరిపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత్కు మూడవ స్వర్ణ పతకం అందించిన 16 ఏళ్ల సౌరభ్ చౌదరిని ప్రముఖులు, సెలబ్రెటీలు, క్రీడాభిమానులు సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్లలో ఆకాశానికెత్తేస్తున్నారు.
గోల్డెన్ బాయ్ ఆఫ్ ఇండియన్ షూటింగ్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 240.7 పాయింట్లతో సౌరభ్ అగ్రస్థానంలో నిలవగా జపాన్కు చెందిన టొమోయుకి మసుడా రజతం దక్కించుకున్నాడు. అంతేకాదు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఫైనల్లో 240.7 పాయింట్స్తో ఆసియా గేమ్స్లోనే అత్యధిక పాయింట్స్ నమోదు చేసిన షూటర్గా ఘనత సాధించాడు.
దీంతో పాటు గత 24 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న జస్పాల్ రానా రికార్డుని కూడా సౌరభ్ బద్దలు కొట్టాడు. 1994 హిరోషిమా వేదికగా జరిగిన ఆసియా గేమ్స్లో 25 మీటర్ల సెంటర్ పిస్టల్ ఈవెంట్లో జస్పాల్ రానా 17 ఏళ్ల వయసులోనే ఆసియా గేమ్స్లో గోల్డ్ మెడల్ నెగ్గిన భారత షూటర్గా రికార్డ్ నెలకొల్పాడు.
ఇప్పుడు, జస్పాల్ను వెనక్కునెట్టి ఆసియా గేమ్స్ షూటింగ్లో స్వర్ణ పతకం నెగ్గిన అత్యంత పిన్న వయస్కుడిగా సౌరభ్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు ఆసియా గేమ్స్లో భారత్ పతకాల సంఖ్య 8కు చేరింది. ఇందులో 3 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలు ఉన్నాయి. ఒక్క షూటింగ్లోనే భారత్ 6 పతకాలు గెలవడం విశేషం.