లండన్: ట్వంటీ20 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు ఇంగ్లాండ్ లో సందడి చేయబోతున్నాయి. ఐపియల్ తర్వాత క్రికెట్ అభిమానులను మరో సారి ప్రపంచ కప్ అలరించబోతోంది. క్రికెట్ పుట్టింట్లో పండగ సందడి తీసుకొచ్చిన ట్వంటీ20 వరల్డ్ కప్ కు మరి కొన్ని గంటల్లో తెర లేస్తోంది. ఆటపాటలతో ముస్తాబైన వినోదాత్మక క్రికెట్ విందు సిద్ధంగా ఉంది.
చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఆతిథ్య ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ జట్ల మధ్య పోరుతో మెగా ఈవెంట్కు తెరలేవబోతోంది. ఊహించినట్లుగా ఇంగ్లాండ్ నెగ్గితే సాదాసీదా ట్వంటీ20 మ్యాచ్ గా తొలి మ్యాచ్ నిలిచిపోతుంది. సంచలనమైతే మరపురానిదిగా మిగిలిపోతుంది. ఇంగ్లాండు ఇప్పటివరకు ప్రపంచకప్ నెగ్గలేకపోయింది. కనీసం టీ20 కప్ నైనా గెల్చుకోవాలని ఆ జట్టు భావిస్తోంది. గ్రూప్-బిలో బరిలో ఉన్నవి మూడు జట్లే అయినా పోటీ ఇంగ్లాండ్, పాకిస్థాన్ ల మధ్యే ఉంటుంది.
బంగ్లాదేశ్ తో భారత్ రేపు తలపడబోతోంది. భారత్ ట్వంటీ 20 హాట్ ఫేవరేట్ గా ఉంది. వార్మప్ మ్యాచులో పాకిస్తాన్ ను ఓడించడం ద్వారా భారత్ తన సత్తా చాటుకుంది. భారత్ బౌలర్లు, బ్యాట్స్ మన్ మంచి ఊపు మీదున్నారు.