
మృత్యువును జయించి మరోసారి విజేత అయ్యేందుకు:
దెబోరా హెరాల్డ్! జకార్తాలో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న భారత సైక్లిస్ట్. ఇవే ఆమెకు తొలి ఆసియా క్రీడలు. విజేతగా నిలవాలని తహతహలాడుతోంది. కానీ అండమాన్ నికోబార్కు చెందిన దెబోరా అందరిలాంటిది కాదు. చిన్నప్పుడు అత్యంత భయానక పరిస్థితుల్లో మృత్యువును జయించిన ఆమె ఇప్పటికే విజేత. అప్పటికి ఆమెకు తొమ్మిదేళ్లుంటాయేమో! ప్రపంచ వ్యాప్తంగా వేల మందిని పొట్టనపెట్టుకున్న సునామీ సముద్రానికి అతి చేరువలో దెబోరా కుటుంబం నివసిస్తున్న ప్రాంతంపైనా విరుచుకుపడింది.

దగ్గరలో కనిపించిన చెట్టే ఆధారంగా చేసుకుని:
నిద్రలో నుంచి లేచి చెల్లితో పాటే తల్లి చేయి పట్టుకుని పరుగెత్తిన దెబోరా...ఆ కంగారులో వాళ్ల నుంచి విడిపోయింది. వాళ్లు సురక్షిత ప్రదేశానికి చేరుకోగా.. ఆమె మాత్రం నీళ్లలో చిక్కుకుపోయింది. నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతుండగా.. చురుగ్గా ఆలోచించిన దెబోరా ఓ చెట్టెక్కి కూర్చుకుంది. కంటి చూపు మేర నీళ్లే.. తిండీ తిప్పలు లేవు. ఉన్న ఆధారం చెట్టే రక్తం తాగేస్తున్న దోమలతో పోరాడి ఐదు రోజులపాటు ఏడుస్తూనే ఉండిపోయింది.

నేనెంత ఏడ్చానో చెప్పలేను
నీటిలో తేలుతూ ఎన్నో శవాలు. ఆమె చనిపోయి ఉండొచ్చని భావించి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఎట్టకేలకు ఐదు రోజుల తర్వాత అటుగా వచ్చినా సహాయ సిబ్బంది ఆమెను రక్షించారు. ‘మళ్లీ నా కుటుంబాన్ని చూస్తాననుకోలేదు. మా అమ్మానాన్నలు నేను కొట్టుకుపోయి ఉంటానని ఎంతో ఏడ్చారు. చివరికి వాళ్లను కలిశాక నేనెంత ఏడ్చానో చెప్పలేను'' అని ఆ భయానక అనుభవాన్ని గుర్తు చేసుకుంది దెబోరా.

ఒలింపిక్ పతకమే నా లక్ష్యం.
పరిస్థితులు చక్కబడ్డాక సైక్లింగ్పై ఆసక్తి పెంచుకున్న ఆమె... క్రమంగా అందులో పట్టు సంపాదించింది. సాయ్ అధికారుల దృష్టిలో పడింది. అధికారులు దెబోరాను పోర్ట్బ్లెయిర్లోని సాయ్ సెంటర్కు తీసుకెళ్లడంతో ఆమె జీవితమే మారిపోయింది. అనేక టోర్నీల్లో ఎన్నో పతకాలు సాధించిన ఆమె ఇప్పుడు ఆసియా క్రీడల దాకా వచ్చింది. ‘నేను బాగా ఆడాలనుకుంటున్నా. ఒలింపిక్ పతకమే నా లక్ష్యం. దేశం తరఫున గొప్పగా రాణించాలనుకుంటున్నా' అని దెబోరా చెబుతోంది.


Click it and Unblock the Notifications












