
టోక్యో: జపాన్ వేదికగా జరుగుతున్న టోక్యో పారాలింపిక్స్ 2020లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. శుక్రవారం భారత ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల హై జంప్లో ప్రవీణ్ కుమార్ సిల్వర్ మెడల్ సాధించాడు. బంగారు పతకం కోసం జరిగిన ఫైనల్లో గ్రేట్ బ్రిటన్కు చెందిన జోనాథన్ ఎడ్వర్డ్స్ 2.10 మీటర్లు ఎత్తు ఎగిరాడు. అయితే ప్రవీణ్ దీనిని అందుకోవడంలో విఫలమయ్యాడు. దాంతో ప్రవీణ్ కుమార్ (2.07 మీ.) రజతంతో సరిపెట్టుకున్నాడు. పోలాండ్కు చెందిన మసీజ్ లెపియాటోకు బ్రోన్జ్ మెడల్ దక్కింది.
ప్రవీణ్ కుమార్ ఈ రోజు సిల్వర్ మెడల్ సాధించడంతో టోక్యో పారాలింపిక్స్ 2020లో భారత్ పతకాల సంఖ్య 11కు చెరింది. ఇందులో రెండు బంగారు (అవని లెఖారా, సుమిత్ అంటిల్), ఆరు సిల్వర్ (ప్రవీణ్ కుమార్, మరియప్ప తంగవేల్, దేవేంద్ర ఝజారియా, యోగేష్ కథునియా, నిషద్ కుమార్, భవీనాబెన్ పటేల్), మూడు వెండి (శరద్ కుమార్, సిఘ్రాజ్ అధనా, సుందర్ సింగ్ గుర్జర్) మెడల్స్ ఉన్నాయి. మహిళల క్లబ్ త్రో (మ 3.35) ఎఫ్-51 ఫైనల్ (మ. 3.35) ఈ రోజు జరగనున్నాయి. ఏక్తా భ్యాన్, కాశిష్ లక్రాలు పోటీ పడనున్నారు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ పోటీలు కూడా ఉన్నాయి.
నిజానికి భారత పారా అథ్లెట్లు పారాలింపిక్స్ 2020లో సాధించింది 12 పతకాలు. అయితే డిజేబిలిటీ క్లాసిఫికేషన్లో వినోద్ కుమార్ అనర్హుడిగా తేలింది. దాంతో అతనికి దక్కిన కాంస్య పతకాన్ని పారాలింపిక్స్ 2020 నిర్వాహకులు రద్దు చేశారు. దాంతో పారాలింపిక్స్లో భారత్ ఓ పతకం కోల్పోయింది. పురషుల డిస్కస్ త్రో F52 కేటగిరీలో గత ఆదివారం భారత అథ్లెట్ వినోద్ కుమార్ డిస్క్ను 19.91 మీటర్ల దూరం విసిరి బ్రాంజ్ మెడల్ను సాధించిన సంగతి తెలిసిందే. అయితే వినోద్ కుమార్ F52 కేటగిరీ పరిధిలోకి రాడని ఫిర్యాదు అందడంతో.. అతడు గెలిచిన పతకాన్ని నిర్వహకులు హోల్డ్లో ఉంచారు. ఫిర్యాదును సమీక్షించిన పారాలింపిక్స్ 2020 టెక్నికల్ కమిటీ నిర్వహకులు వినోద్ కుమార్ F52 కేటగిరీ పరిధిలోకి రాడని తేల్చారు.
పారాలింపిక్స్ 2020లో భారత్కు మరో పతకాన్ని అందించిన హైజంపర్ ప్రవీణ్ కుమార్ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. అతని కృషి, పట్టుదలకు ఈ పతకమే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు. 'పారాలింపిక్స్ 2020లో ప్రవీణ్ కుమార్ రజత పతకం సాధించినందుకు గర్వపడుతున్నా. ఈ పతకం అతని కృషి, అసమానమైన అంకితభావానికి నిదర్శనం. ప్రవీణ్ కుమార్కు అభినందనలు. భవిష్యత్లో అతను చేసే ప్రయత్నాలకు శుభాకాంక్షలు' అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.