
టోక్యో: టోక్యో ఒలింపిక్స్ 2020 సంబరాల్లో మునిగి తేలాక రెండు వారాలు విరామం తీసుకున్న క్రీడాభిమానులు మరో మెగా పండగను చూడనున్నారు. టోక్యో వేదికగానే మరో విశ్వ క్రీడాసంబంరం మొదలైంది. 16వ పారాలింపిక్స్ వేడుకలు మంగళవారం సాయంత్రం టోక్యో ప్రధాన స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఆరంభ వేడుకల్లో జావెలిన్ త్రోవర్ టెక్ చంద్ భారత జట్టును ముందుండి నడిపించాడు. విశ్వక్రీడా వేదికపై మువ్వన్నెల జెండాను చూసి భారత ప్రేక్షకులు మురిసిపోయారు. నృత్యాలు, డాన్సులు, పాటలతో కళాకారులు సందడి చేశారు.
నిజానికి రియో పారాలింపిక్స్లో స్వర్ణ పతక విజేత మరియప్పన్ తంగవేలు భారత పతాకధారిగా ఎంపికయ్యాడు. టోక్యోకు వెళ్లేటప్పుడు విమానంలో ఓ కరోనా పాజిటివ్ వ్యక్తితో మరియప్పన్ సహా మరో ఐదు మంది భారత అథ్లెట్లు సన్నిహితంగా మెలిగారు. దీంతో పారాలింపిక్స్ నిబంధనల ప్రకారం అందర్నీ క్వారంటైన్కు తరలించారు. దీంతో ప్రారంభ వేడుకలకు కొద్ది నిమిషాల ముందు భారత పతకధారిగా అధికారులు టెక్ చంద్ను ఎంపిక చేశారు. ఆరంభ వేడుకల్లో జావెలిన్ త్రోవర్ టెక్ చంద్ భారత జట్టును ముందుండి నడిపించాడు. ఈరోజు ప్రారంభమయ్యే టోక్యో పారాలింపిక్స్ సెప్టెంబర్ 5 వరకు జరగనున్నాయి.
2016 రియో పారాలింపిక్స్ హైజంప్ క్రీడలో స్వర్ణం సాధించిన మరియప్పన్ తంగవేలుకు.. 2017లో పద్మశ్రీ, అర్జున పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. గతేడాది మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డునూ అందుకున్నాడు. టోక్యో పారాలింపిక్స్ 2020లో ఈ సారి భారతదేశం తరఫున అత్యధికంగా 54 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 5 వరకు 13 రోజుల పాటు జరిగే పారా విశ్వక్రీడల్లో 163 దేశాలకు చెందిన సుమారు 4500 మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. 22 క్రీడలకు సంబంధించి 540 ఈవెంట్లలో పోటీలు జరగనున్నాయి.
1972 నుంచి పారాలింపిక్స్లో బరిలోకి దిగుతున్న భారత్ ఇప్పటివరకు 12 పతకాలు సాధించింది. ఇందులో 2016 రియో గేమ్స్లో రెండు గోల్డ్, ఒక సిల్వర్, ఒక బ్రాంజ్తో 43వ ప్లేస్లో నిలిచింది. అయితే ఈసారి ఆ సంఖ్యను మార్చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 5 గోల్డ్ మెడల్స్తో కలిపి 15 పతకాలు గెలవాలని ప్లాన్స్ చేస్తోంది. ఇందుకోసం 54 మంది బరిలోకి దిగుతుండగా.. 9 క్రీడాంశాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కరోనా నేపథ్యంలో ఈసారి చాలా దేశాలు గేమ్స్ నుంచి వైదొలిగాయి. దీంతో ఈసారి భారత్ టాప్-25లో ఉండొచ్చని అందరూ అంచనా వేస్తున్నారు.
టోక్యో పారాలింపిక్స్లో తొలిసారి బ్యాడ్మింటన్ను ప్రవేశ పెట్టనుండగా.. భారత్కు ఈ క్రీడల్లో పతకా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎస్ఎల్3 కేటగిరీలో ప్రపంచ నంబర్వన్ ప్రమోద్ భగత్తో పాటు కృష్ణ (ఎస్హెచ్6), తరుణ్ ఢిల్లాన్ (ఎస్ఎల్4) ఆశలు రేపుతుండగా.. మహిళల విభాగంలో పరుల్ పర్మార్ (ఎస్ఎల్-3), పాలక్ కోహ్లీ (ఎస్యూ-5) భారీ అంచనాల మధ్య బరిలోకి దిగనున్నారు. భారత అథ్లెటిక్స్ చరిత్రలో తొలి స్వర్ణంతో నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్లో కొత్త చరిత్ర సృష్టించగా.. పారాలింపిక్స్లో అదే జోరు కొనసాగించేందుకు జావెలిన్ త్రోయర్స్ ఉవ్విళ్లూరుతున్నారు. ఎఫ్64 విభాగంలో ప్రపంచ చాంపియన్ సందీప్ చౌదరి పతకా ఆశలు రేపుతుండగా.. సుందర్సింగ్, అజీత్ (ఎఫ్46), నవ్దీప్ (ఎఫ్41) తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అన్ని విభాగాల్లో వైకల్యాన్ని బట్టి క్లాసిఫికేషన్లుగా విభజించగా.. మహిళల టేబుల్ టెన్నిస్తో భారత అథ్లెట్లు పతకాల వేట ఆరంభించనున్నారు.