
టోక్యో: జపాన్ వేదికగా ప్రతిష్ఠాత్మకంగా సాగుతోన్న టోక్యో ఒలింపిక్స్లో భారత్ మరో స్ఫూర్తిదాయక విజయాన్ని అందుకుంది. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను సాధించిన అద్భుత విజయాన్ని స్ఫూర్తిగా తీసుకున్న మహిళా అథ్లెట్లు పతకం వేటలో ముందుకు సాగుతోన్నారు. తాజాగా టేబుల్ టెన్నిస్లో మణికా బాత్రా, సుతీర్థ ముఖర్జీ ముందంజ వేశారు. తమ ప్రత్యర్థులను వారు చిత్తు చేశారు. రెండో రౌండ్లో అడుగు పెట్టారు.
టోక్యో మెట్రోపాలిటన్ జిమ్ సెంటర్లో ఏర్పాటు చేసిన టేబుల్ టెన్నిస్ విమెన్స్ సింగిల్స్లో ఈవెంట్లో మణికా బాత్రా, సుతీర్థ తమ ప్రత్యర్థులపై పైచేయి సాధించారు. మణికా బాత్రా బ్రిటన్కు చెందిన టిన్ టిన్ హోపై నాలుగు వరుస సెట్లలో విజయం సాధించారు. 11-7, 11-6, 12-10, 11-9 తేడాతో గెలుపొందారు. 30 నిమిషాల్లోనే బాత్రా ఈ విజయాన్ని తన ఖాతాలో వేసుకోగలిగారంటే.. ఏ స్థాయిలో ఆమె దూకుడు కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. ఏ దశలోనూ ఆమె తన ప్రత్యర్థికి పుంజుకునే అవకాశాన్ని ఇవ్వలేదు. తన ప్రధాన బలమైన ఫోర్ హ్యాండ్ షాట్లతో ముప్పుతిప్పలు పెట్టారు.
అంతకుముందే- మిక్స్డ్ డబుల్స్ టేబుల్ టెన్నిస్ విభాగంలో తమిళనాడుకు చెందిన ఆచంట శరత్ కమల్తో కలిసి ఆమె పాల్గొన్నారు. అది అచ్చి రాలేదు. లిన్ యున్ జు పెయిర్తో సాగిన ఆ మ్యాచ్ను మణికా బాత్రా ఓడిపోయింది. ఆచంట శరత్ కమల్-మణికా బాత్రా జోడీ టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్లో మలి రౌండ్లో చేరుకోవడంలో విఫలమైంది. ఆ తరువాత కొద్దిసేపటి జరిగిన విమెన్స్ సింగిల్స్లో మణికా బాత్రా తనదైన శైలిలో విజృంభించి ఆడారు. విజయాన్ని సొంతం చేసుకున్నారు. మలి రౌండ్లో ఎంట్రీ ఇచ్చారు.
మరో విమెన్స్ సింగిల్స్లో సుతీర్థ ముఖర్జీ ముందడుగు వేశారు. స్వీడన్కు చెందిన లిండా బెర్గ్స్ట్రోయెమ్ను ఆమె ఓడించారు. తన ఓపెనింగ్ మ్యాచ్లో సుతీర్థ.. 5-11, 11-9, 11-13, 9-11, 11-3, 11-9, 11-5 సెట్ల సుదీర్ఘ పోరాటంలో విజయం సాధించారు. తన ప్రస్థానంలో సుతీర్థ రెండు సెట్లను కోల్పోయినప్పటికీ.. వెనక్కి తగ్గలేదు. అసాధారణ పోరాట పటిమను ప్రదర్శించారు. నాలుగు, అయిదు సెట్లను అలవోకగా గెలిచారు. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఈ రెండు సెట్లలోనూ లిండా 3, 5 అయిదు పాయింట్లను మాత్రమే సాధించగలిగింది.