
టోక్యో: ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ 2021కు ఆతిథ్యాన్ని ఇస్తోన్న జపాన్.. పతకాల వేటలో చైనాతో పోటీ పడుతోంది. డ్రాగన్ కంట్రీతో సమానంగా బంగారు పతకాలను సాధించింది. రజతం, కాంస్య పతకాల్లో జపాన్ అథ్లెట్లు సాధించిన పతకాలు తక్కువే అయినప్పటికీ.. స్వర్ణ పతకాల వేటలో మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఆ దేశానికి చెందిన అథ్లెట్లు శక్తివంచన లేకుండా మెడల్స్ కోసం శ్రమిస్తోన్నారు. స్వర్ణ పతకాలపైనే దృష్టి పెట్టారు. ఫలితంగా రజతం, కాంస్యాల కంటే గోల్డ్ మెడల్సే అధికంగా ఉంటోన్నాయి.
ఈ విషయంలో చైనాతో సమానంగా బంగారు పతకాలను సాధించింది జపాన్. తన దేశానికి పతకాలను అందించడంలో 13 సంవత్సరాల చిచ్చర పిడుగుల సైతం పోటీ పడుతోన్నారు. మహిళల స్కేట్ బోర్డ్ కేటగిరీలో జపాన్ రెండు పతకాలను ఆర్జించింది. ఒకటి- స్వర్ణం.. రెండు కాంస్యం. ఈ రెండింటినీ తమ దేశానికి అందించిన అథ్లెట్ల వయస్సు టీనేజ్ కూడా దాటలేదు. జపాన్కు చెందిన 13 సంవత్సరాల బాలిక మొమిజి నిషియా స్కేట్ బోర్డ్ విభాగంలో బంగారు పతకాన్ని అందుకున్నారు.
ఇదే కేటగిరీలో 16 సంవత్సరాల వయస్సున్న ఫ్యూనా నకయామా మూడో స్థానంలో నిలిచారు. కాంస్య పతకాన్ని ముద్దాడారు. టోక్యో ఒలింపిక్స్లో జపాన్ అందుకున్న మొట్టమొదటి కాంస్య పతకం అదే. ఇక ఈ కేటగిరీలో రజత పతకాన్ని మాత్రం బెల్జియం ఎగరేసుకెళ్లింది. ఆ దేశానికి చెందిన రేస్సా లెయాల్ రెండో స్థానంలో నిలిచింది. రేస్సా లెయాల్ వయస్సు కూడా 13 సంవత్సరాలే కావడం అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనితో ఇప్పటిదాకా జపాన్కు దక్కిన మొత్తం బంగారు పతకాల సంఖ్య ఆరుకు చేరింది.
ఈ విషయంలో ఆతిథ్య దేశం.. చైనాతో పోటీ సమానంగా నిలిచింది. జపాన్ మొత్తం ఆరు స్వర్ణాలు, ఒకటి చొప్పున రజతం, కాంస్య పతకాలను సాధించింది. మొత్తం ఎనిమిది పతకాలతో మెడల్స్ టేబుల్లో రెండో స్థానంలో నిలిచింది. చైనా- ఆరు బంగారు పతకాలు, రెండు రజతాలు, అయిదు కాంస్యాలతో 13 మెడల్స్ సాధించింది. టేబుల్ టాపర్గా నిలిచింది. అగ్రరాజ్యం అమెరికా మూడో స్థానంలో కొనసాగుతోంది. అయిదు స్వర్ణాలు, మూడు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో 12 మెడల్స్తో టాప్-3లో నిలిచింది.