
టోక్యో: జపాన్ వేదికగా సాగుతోన్న ఒలింపిక్స్లో రెండో రోజు భారత్ అద్భుత ప్రదర్శనను కనపరిచింది. కొన్ని విభాగాల్లో మిశ్రమ ఫలితాలను అందుకున్నప్పటికీ.. వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను వాటన్నంటినీ తుడిచి పెట్టేశారు. రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఆమె రెండో స్థానంలో నిలిచారు. ఒలింపిక్స్ ప్రారంభమైన రెండో రోజే భారత్ ఓ పతకాన్ని ముద్దాడింది. అదే సమయంలో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో భమిడిపాటి సాయి ప్రణీత్ నిరాశపరిచినప్పటికీ.. డబుల్స్ విభాగం మాత్రం ముందడుగు వేసింది.
పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ షెట్టి జోడి.. రెండో రౌండ్లో అడుగు పెట్టింది. గ్రూప్ ఏ తొలి మ్యాచ్లో- ప్రపంచ ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో ఉన్న లీ యాంగ్, వాంగ్ చి-లిన్ జంటపై అద్భుత విజయాన్ని సాధించింది. లీ యాంగ్/చి-లిన్ ర్యాంక్తో పోల్చుకుంటే సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ షెట్టి ర్యాంక్ చాలా తక్కువ. భారత పురుషుల డబుల్స్ జోడీ ర్యాంక్..10. ర్యాంకింగ్లో తమ కంటే పై స్థాయిలో ఉన్న చైనీస్ తైపే పెయిర్ను ఓడించి.. పతకం దిశగా ఓ అడుగు ముందుకేసింది. 21-16, 16-21, 27-25 సెట్ల తేడాతో చైనీస్ తైపే జోడీపై విజయం సాధించారు సాయిరాజ్, చిరాగ్ షెట్టి.
తొలి సెట్లో సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ షెట్టి జోడీకి ఎదురు లేకుండా పోయింది. దూకుడుగా ఆడారు వారిద్దరు. అద్భుతమైన డ్రాప్ షాట్లను సంధించారు. చైనీస్ తైపే జోడి కుదురుకునే లోపే మ్యాచ్పై ఆధిపత్యాన్ని సాధించారు. తొలి సెట్ను 21-16 స్కోరుతో సొంతం చేసుకున్నారు. రెండో సెట్లో లీ యాంగ్, వాంగ్ చి-లిన్ చెలరేగి ఆడారు. తమ అసలు ఆటను ప్రదర్శించారు. గాడిలో పడ్డ తరువాత- వారిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సాత్విక్/చిరాగ్ షెట్టి.. వారిని అడ్డుకోవడానికి వేసిన వ్యూహాలేవీ ఫలించలేదు. దీనితో రెండో సెట్ను 16-21 తేడాతో కోల్పోవాల్సి వచ్చింది.
రెండో సెట్ను కోల్పోయినప్పటికీ.. వారు ఆత్మస్థైర్యాన్ని వదలుకోలేదు. మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించే మూడో సెట్లో ఎదురుదాడికి దిగారు. ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. సై అంటూ సై అంటూ పోటీ పడ్డారు. సమవుజ్జీలుగా నిలిచారు. చివరి రౌండ్లో తమ జోరును మరింత పెంచారు. ఒకదశలో వెనుకంజలో ఉన్నప్పటికీ.. ఆశలు వదలుకోలేదు. గెలవాలనే పట్టుదలను ప్రదర్శించారు. వెనుకంజలో ఉన్నప్పటికీ.. లీయాంగ్/చి-లిన్కు ఎలాంటి అవకాశాన్ని ఇవ్వకుడా బుల్లెట్లా ఆధిక్యతలోకి దూసుకొచ్చారు. మూడో సెట్ను 27-25 స్కోర్ తేడాతో గెలుచుకున్నారు. బ్యాడ్మింటన్ విభాగంలో ఖచ్చితంగా పతకం వస్తుందనే అంచనాలు ఉన్నాయి. వాటిని నిజం చేశారు.