
టోక్యో: కరోనా వైరస్ కారణంగా ఏడాది వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్ కొత్త షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది జూలై 23న ప్రధాన స్టేడియంలో విశ్వక్రీడల ఆరంభ వేడుక జరుగనుందని నిర్వాహకులు తెలిపారు. అయితే ఆరంభ వేడుకలకు ముందే మహిళల సాఫ్ట్బాల్, ఫుట్బాల్, పురుషుల ఫుట్బాల్, ఆర్చరీ ఈవెంట్లు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఆరంభ వేడుకల అనంతరం తొలి మెడల్ ఈవెంట్గా మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పోటీలు జరుగుతాయని టోక్యో క్రీడల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు యోషిరో మోరి, సీఈవో టొషిరో ముటో శుక్రవారం స్పష్టం చేశారు.
వచ్చే ఏడాది జులై 24న ఆరంభమయ్యే ఒలింపిక్స్లో హాకీ షెడ్యూల్ శుక్రవారం విడుదల అయింది. భారత పురుషుల జట్టు తొలి మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడనుంది. పూల్-ఎలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, స్పెయిన్, జపాన్, న్యూజిలాండ్తో కలిసి మన్ప్రీత్సింగ్ బృందం ఆడనుంది. భారత్ జులై 25న ఆస్ట్రేలియాతో, జులై 27న స్పెయిన్తో, జులై 29న ఒలింపిక్ ఛాంపియన్ అర్జెంటీనాతో, 30న జపాన్తో తలపడనుంది.
మరోవైపు పూల్-ఎలో ఉన్న మహిళల జట్టు నెదర్లాండ్తో మ్యాచ్తో సమరం ప్రారంభించనుంది. ఈ పూల్లో జర్మనీ, గ్రేట్ బ్రిటన్, ఐర్లాండ్, దక్షిణాఫ్రికా ఉండగా, పూల్-బిలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, న్యూజిలాండ్, స్పెయిన్, చైనా, జపాన్ ఆడనున్నాయి. నెదర్లాండ్స్తో ఆరంభ మ్యాచ్ తర్వాత జర్మనీ (జులై 26), గ్రేట్ బ్రిటన్ (జులై 28), అర్జెంటీనా (జులై 29), జపాన్ (జులై 30)తో రాణీ రాంపాల్ సేన తలపడనుంది.
కాగా మెగాఈవెంట్ కోసం అత్యున్నత హంగులతో 42 వేదికలను సిద్ధం చేశామని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) శుక్రవారం తెలిపింది. 42 వేదికల్లో ఒలింపిక్స్ పోటీలు జరగనున్నాయి. 22న పురుషుల సాకర్, 23న ఆర్చరీ, రోయింగ్ పోటీలు మొదలవుతాయి. ఇక తొలి మెడల్ ఈవెంట్ జూలై 24న జరగనుంది. దీంతో విశ్వక్రీడలకు సన్నద్ధమవుతున్న క్రీడాకారులు తమ ప్రాక్టీస్ను మరింత పెంచనున్నారు. ఈ షెడ్యూల్ విడుదలతో వారిలో కొత్త ఉత్సహం నిండింది.