బ్యాడ్మింటన్లో ఓటమి..
టోక్యో ఒలింపిక్స్లో భారత్ పతకం సాధిస్తుందనుకునే కేటగిరీలో టాప్లో ఉండే ఈవెంట్.. బ్యాడ్మింటన్. ఇందులోనే తొలి పరాజయం ఎదురైంది. భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, తెలుగు తేజం భమిడిపాటి సాయి ప్రణీత్.. తన తొలి మ్యాచ్లో ఓడిపోయాడు. ఇజ్రాయెల్ ఆటగాడు మిషా జిల్బర్మ్యాన్ చేతిలో అతనికి చుక్కెదురైంది. వరుస సెట్లను ప్రత్యర్థికి కోల్పోయాడు సాయి ప్రణీత్. ఏ సెట్లో కూడా గట్టి పోటీ ఇవ్వలేకపోయాడు. ప్రతిఘటించలేకపోయాడు. తొలి సెట్ను 17-21, రెండో సెట్ను 15-21 తేడాతో ఓటమి పాలయ్యాడు. 42 నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసింది.
బలాలు.. బలహీనతలు తెలిసినా..
మిషా జిల్బర్మ్యాన్ కొత్తోడేమీ కాదు. ఇదివరకు సాయిప్రణీత్ ఓ సారి అతనితో తలపడ్డాడు.. విజయం సాధించాడు. మిషా బలాలు, బలహీనతలేమిటో అతినికి తెలుసు. విస్ ఓపెన్లో సాయి ప్రణీత్, మిషా హోరాహోరీగా పోరాడారు. ఆ మ్యాచ్లో సాయి ప్రణీత్ గెలిచాడు. దానికి ప్రతీకారాన్ని తీర్చుకున్నట్టయింది మిషా. ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్లో సాయి ప్రణీత్ దండయాత్రకు అడ్డుగా నిలిచాడు. సైంధవుడిలా అడ్డుపడ్డాడు.
డ్రాప్ షాట్లకు నో సౌండ్
ఒలింపిక్స్లో మిషా అగ్రెసివ్గా ఆడాడు. తన ప్రత్యర్థిని కోలుకోనివ్వకుండా చేశాడు. ఊపిరి సలుపుకోనివ్వని షాట్లను ఆడాడు. మిషా జిల్బర్మ్యాన్ డ్రాప్ షాట్లను సాయి ప్రణీత్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. మిషా కొన్ని పొరపాట్లను చేసినప్పటికీ.. వాటిని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సాయి ప్రణీత్ విఫలం అయ్యాడు. ఒక దశలో మిషా రెట్టింపు పాయింట్లను సాధించాడు. సాయి ప్రణీత్ ఏడు పాయింట్ల వద్ద నిలిచిపోగా.. అతని దూకుడు 11 వరకూ కొనసాగింది. అదే తేడా మ్యాచ్ చివరి వరకూ కంటిన్యూ అయింది. మిషాను అధిగమించడానికి సాయి ప్రణీత్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.
ఫస్ట్ టైమ్ ఒలింపిక్స్
సాయి ప్రణీత్కు ఇదే తొలి ఒలింపిక్స్. ఏస్ షట్లర్ పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో 15వ స్థానంలో ఉన్నాడు. అదే సమయంలో మిషా జిల్బర్మ్యాన్ ర్యాంక్ 47 మాత్రమే. తన కంటే చాలా తక్కువ ర్యాంక్ ఉన్న ఆటగాడిని ఓడించలేెకపోవడానికి సాయి ప్రణీత్ తడబాటే కారణమని విశ్లేషిస్తోన్నారు క్రీడా పండితులు. తొలిసారిగా ఒలింపిక్స్కు ప్రాతినిథ్యాన్ని వహించాల్సి రావడం వల్ల కొంత నెర్వస్గా ఫీల్ అయినట్టు కనిపించాడని, దాన్ని మిషా తనకు అనుకూలంగా మార్చుకోగలిగాడని అంచనా వేస్తోన్నారు.