
జపాన్: మరో ఆరు రోజుల్లో టోక్యో ఒలింపిక్స్ 2021 క్రీడా సంబరం మొదలవనున్న వేళ.. నిర్వాహకులకు భారీ షాక్ తగిలింది. శిక్షణ శిబిరంలో ఉన్న ఉగాండా అథ్లెట్ ఒకరు అదృశ్యమయ్యాడు. ఉగాండా వెయిట్ లిఫ్టర్ జూలియస్ సెకిటోలెకో హోటల్ నుంచి అదృశ్యమయ్యాడు. ఈ విషయం ఒలింపిక్స్ నిర్వాహకుల్లో వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తితో సతమతమవుతున్న నిర్వాహకులను అథ్లెట్ అదృశ్యం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
జపాన్లోని ఒసాకా రాష్ట్రంలోని ఇజుమిసానో పట్టణంలో ఉంటూ.. 9 మంది సభ్యుల ఉగాండా జట్టు ఒలింపిక్స్కు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. అయితే ఉగాండా జట్టులో 20 ఏళ్ల వెయిట్ లిఫ్టర్ జూలియస్ సెకిటోలెకో శుక్రవారం నుంచి కనిపించకుండా పోయాడు. హోటల్ గదిలో సహచరుడు లేకపోవడాన్ని మధ్యాహ్నం గమనించిన ఇతర క్రీడాకారులు తమ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు ఎంత వెతికినా హోటల్లో కనిపించకపోవడంతో ఉగాండా అధికారులు వెంటనే ఒలింపిక్స్ నిర్వహకులు సమాచారం అందించారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సెకిటోలెకో కోసం జపాన్ పోలీసులు గాలిస్తున్నారు.
మరోవైపు ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో తొలి కరోనా వైరస్ కేసు నిర్ధారణ అయ్యింది. స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తుండగా.. గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్గా తేలినట్లు టోక్యో నిర్వాహక కమిటీ ప్రతినిధి మాసా టకాయా శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆ వ్యక్తి పేరు, ఇతర వివరాలను వెల్లడించలేదు. ప్రస్తుతం అతడిని ఒలింపిక్ గ్రామం నుంచి బయటకు తీసుకొచ్చి ఓ హోటల్లో ఐసోలేషన్లో ఉంచారు.
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏడాదిన్నర పాటు వాయిదా పడిన ఒలింపిక్స్ 2020 ఈ నెల 23 నుంచి టోక్యోలో ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 13న ఒలింపిక్స్ క్రీడా గ్రామాన్ని తెరిచారు. ఇప్పటికే వేలాది మంది అథ్లెట్లు, అధికారులు ఈ గ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే కేసులు బయటపడుతున్నాయి. దీంతో గ్రామంలో కరోనా వ్యాప్తి జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. కరోనా దృష్ట్యా కఠిన నిబంధనల నడుమ ఒలింపిక్స్ను నిర్వహించనున్నారు.