టోక్యో: జపాన్ వేదికగా సాగుతోన్న రసవత్తరంగా సాగుతోన్న ఒలింపిక్స్లో నాలుగో రోజు భారత్.. మరో ముందుడుగు వేసింది. కీలకమైన కేటగిరీలో పతకాల వేటను ప్రారంభించింది. పురుషుల అర్చరీ విభాగంలో క్వార్టర్ ఫైనల్స్కు చేరగా.. తాజాగా టేబుల్ టెన్నిస్ కేటగిరీలో మరో అడుగు ముందుకు వేసింది. అదే సమయంలో భారత స్టార్ ఫెన్సర్ చదలవాడ భవానీ దేవి.. తన మలి రౌండ్లో ఓటమి చవి చూశారు. మహిళల వ్యక్తిగత సబ్రె ఫెన్సింగ్ టేబుల్ 32 రౌండ్లో ఆమె ఓటమి చవి చూశారు.
కజక్..ఫసక్: ఒలింపిక్స్లో క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లిన భారత్
పురుషుల టేబుల్ టెన్నిస్ కేటగిరీలో భారత పెడ్లర్ ఆచంట శరత్ కమల్ అదర గొట్టాడు. రౌండ్లో అతను అనూహ్య విజయాన్ని అందుకున్నాడు. ఆరు సెట్ల పాటు సుదీర్ఘంగా సాగిన మ్యాచ్లో పోర్చుగల్కు చెందిన పెడ్లర్ టియాగో అపొలోనియాను మట్టికరిపించాడు. మూడో రౌండ్లోకి అడుగు పెట్టాడు. జపాన్ కాలమానం ప్రకారం.. ఈ ఉదయం 10:30 గంటలకు టోక్యో మెట్రోపాలిటన్ జిమ్ టేబుల్ 1పై మ్యాచ్ ఆరంభమైంది. తొలి సెట్లో నాసిరకంగా ఆటతీరును కనపరిచాడు శరత్ కమల్. ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టలేకపోయాడు.
టియాగో అపోలోనియా ఆడిన కొన్ని షాట్లకు శరత్ కమల్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. తొలి సెట్లో అతను సాధించింది రెండు పాయింట్లే. ఆ సెట్ను 2-11 తేడాతో ఓడిపోయాడు. తొలి సెట్ 49 సెకెండ్లలోనే ముగిసింది. ఈ దశలో అతను గెలుస్తాడని ఎవరికీ ఆశల్లేవు. ఈ పరిస్థితుల్లో అతను అనూహ్యంగా చెలరేగిపోయాడు. రెండో రౌండ్ నుంచి పూనకం వచ్చినట్లుగా రెచ్చిపోయాడు. టియాగో అపోలోనియాకు పట్టపగలే చుక్కలు చూపించాడు. ఏ దశలోనూ అతనికి కోలుకునే అవకాశాన్ని ఇవ్వలేదు. కళ్లు చెదిరే షాట్లతో అసాధారణ ఆటతీరును ప్రదర్శించాడు.
నాలుగో సెట్ మినహా మరెందులోనూ తన ఆధిపత్యాన్ని చేజారనివ్వలేదు. మొత్తంగా 2-11, 11-8, 11-5, 9-11, 11-6, 11-9 సెట్ల తేడాతో విజయాన్ని అందుకున్నాడు. ఆరు సెట్ల ఈ మ్యాచ్ను 4-2 తేడాతో కైవసం చేసుకున్నాడు. మొత్తం 48 నిమిషాల్లోనే మ్యాచ్ను ముగించేశాడు. మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. ఈ రౌండ్లో అతను చైనా పెడ్లర్ ఎం ఏ లాంగ్ను ఢీ కొట్టాల్సి ఉంది. మూడో రౌండ్లో బలమైన ప్రత్యర్థి ఎదురయ్యాడు. ఈ చైనా గండాన్ని అధిగమించగలిగితే క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంటాడు.