టోక్యో: టోక్యో ఒలింపిక్స్ 2021 షూటింగ్ విభాగంలో భారత్ అంచనాలను అందుకుంది. పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్ ఫైనల్కు చేరింది. ఈ విభాగంలో భారత యువ షూటర్ సౌరభ్ చౌదరీ ఫైనల్కు అర్హత సాధించాడు. క్వాలిఫికేషన్ రౌండ్లో చౌదరీ అగ్రస్థానంలో నిలిచాడు. 586 పాయింట్లతో 19 ఏళ్ల యువ షూటర్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో భారత మరో షూటర్ అభిషేక్ వర్మ నిరాశపరిచాడు. అతడు అర్హత సాధించలేకపోయాడు. 575 పాయింట్లతో అభిషేక్ 17వ స్థానంలో నిలిచాడు.
10మీటర్ల పురుషుల ఎయిర్ పిస్టల్ విభాగంలో మొత్తం 36 మంది పోటీపడగా.. 586-28Xతో సౌరభ్ చౌదరీ అగ్రస్థానంలో నిలిచాడు. సౌరభ్ ఆరు సిరీసుల్లో వరుసగా 95, 98, 98, 100, 98, 97 పాయింట్లు సాధించడం గమనార్హం. మధ్యాహ్నం అతడు పతకం సాధిస్తాడో లేదో చూడాలి. 12 గంటలకు ఫైనల్స్ ప్రారంభం కానున్నాయి. యువ షూటర్ సౌరభ్ ఇదే ప్రదర్శన కొనసాగిస్తే.. భారత్ ఖాతాలో పతకం చేరడం ఖాయం. మరోవైపు అభిషేక్ వర్మ 575-19Xతో 17వ స్థానానికి పరిమితమయ్యాడు.
అంతకుముందు భారత మహిళా షూటర్లు పూర్తిగా నిరాశపరిచారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో ఇండియన్ షూటర్లు ఇద్దరు ఉన్నా.. కనీసం ఫైనల్ కూడా చేరుకోలేకపోయారు. ఎన్నో ఆశలు రేపిన ఎలవనిల్ వలరివన్, సీనియర్ అపూర్వి చండీలా ఇద్దరూ ఫైనల్కు క్వాలిఫై కాలేకపోయారు. ఎలవనిల్ 626.5 పాయింట్లతో 16వ స్థానంలో నిలవగా.. అపూర్వి చండీలా 621.9 పాయింట్లతో 36వ స్థానంతో సరిపెట్టుకుంది.
ఇక టేబుల్ టెన్నిస్లో భారత్కు నిరాశే ఎదురైంది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్లో శరత్ కమల్, మనికా బాత్రా జోడీ ఓటమి పాలైంది. మూడో సీడ్, చైనీస్ తైపీకి చెందిన లిన్ యున్ జు, చెంగ్ ఐ చింగ్ చేతిలో 11-8, 11-6, 11-5, 11-4 తేడాతో ఓడిపోయారు. ఇక వీరు వ్యక్తిగత, మహిళలు, పురుషుల విభాగాల్లో అదృష్టం పరీక్షించుకోనున్నారు.
Tokyo Olympics 2021: పతకం గెలిస్తే కోట్లే.. ఏయే దేశాలు ఎంత ప్రకటించాయంటే? భారత్లోనే అత్యధికం!