
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2021లో పాల్గొనే భారత అథ్లెట్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశం అయ్యారు. అథ్లెట్లలో స్ఫూర్తి నింపడం కోసం ప్రధాని మోదీ మంగళవారం కాసేపు వారితో మాట్లాడారు. ఒలింపిక్స్లో పాల్గొనే భారత అథ్లెట్లు అంచనాలకు తలవంచకుండా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. మీ వెనక దేశం మొత్తం అండగా ఉందని, క్రీడా వేదికపై భారత పతాకం రెపరెపలాడించాలని మోదీ కోరారు. జులై 23 నుంచి మెగా క్రీడలు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే.
వర్చువల్ సమావేశంలో మేరీ కోమ్, పీవీ సింధు, సౌరభ్ చౌదరి, శరత్ కమల్, నీరజ్ చోప్రా, సానియా మీర్జా, దీపికా కుమారి తదితరులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సమావేశంలో నూతన కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా పాల్గొన్నారు. 'ఛీర్4ఇండియా'లో భాగంగా ప్రధాని రెండోసారి భారత అథ్లెట్లతో మాట్లాడారు. ఒలింపిక్స్లో పాల్గొనబోయే భారత క్రీడాకారులను ఉద్దేశించి ఇటీవలే ఆయన ప్రసంగించారు. అథ్లెట్లను దేశ ప్రజలంతా ఉత్సాహపరచాలంటూ ప్రధాని పిలుపునిచ్చారు.
టోక్యో ఒలింపిక్స్కు భారత్ నుంచి మొత్తం 228 మంది బృందం వెళుతుందని, అందులో 119 మంది అథ్లెట్లు ఉన్నారని భారత ఒలింపిక్స్ సంఘం అధ్యక్షుడు నరిందర్ బత్రా తెలిపారు. 119 మంది అథ్లెట్లలో 67 మంది పురుషులు, 52 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 85 విభాగాల్లో భారత క్రీడాకారులు పోటీపడుతున్నారు. ఈనెల 17న.. 90 మంది క్రీడాకారులు, ఆయా విభాగాల అధికారులు ప్రత్యేక విమానంలో టోక్యోకు బయలుదేరనున్నారు. మిగతా బృందం మరోసారి వెళ్లనున్నారు.
మంగళవారం ఒలింపిక్స్ గ్రామాన్ని తెరిచారు. ఎంతో ఘనంగా జరపాల్సిన ఈ వేడుక కరోనా వైరస్ కారణంగా సాదాసీదాగా మారింది. జులై 23 నుంచి ప్రారంభంకానున్న టోక్యో ఒలింపిక్స్ క్రీడలకు దాదాపుగా 11వేల మంది, పారాలింపిక్స్కు 4400 మంది క్రీడాకారులు రానున్నారు. పారాలింపిక్స్ ఆగస్టు 24 నుంచి మొదలవుతాయి. క్రీడా గ్రామంలోకి వస్తున్న అథ్లెట్లలో 80% మందికి వ్యాక్సినేషన్ జరిగిందని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తెలిపింది.